పూజారులు ఆలయాలకు ఇచ్చిన భూములకు సంరక్షకులు మాత్రమేనని, వారికి ఎలాంటి యాజమాన్య హక్కులూ ఉండబోవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వారు యజమానులు కాదు కాబట్టి రెవెన్యూ రికార్డుల్లో పూజారుల పేర్లు రాయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.
ఆలయ భూములపై పర్యవేక్షణ హక్కులు ఉన్నంత మాత్రాన వారు భూస్వాములు కాలేరని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఆలయాల భూములను పూజారులు అనధికారికంగా విక్రయించకుండా ఉండేలా, ఆలయ భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల నుంచి పూజారుల పేర్లు తొలగించేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ మధ్య రెండు సర్క్యులర్లు జారీ చేసింది. అయితే, దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లగా.. ప్రభుత్వ ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం.. ‘ఆలయ భూములకు సంబంధించిన రికార్డుల్లో ఓనర్షిప్ కాలమ్, అనుభవదారు కాలమ్లలో దేవుడి పేరు మాత్రమే ఉండాలి’ అని స్పష్టం చేసింది.
ఎందుకంటే ఆ భూములకు దేవుడే యజమాని. పూజారి కేవలం దేవుడి ఆస్తులకు సంరక్షకుడు. అందువల్ల పూజారుల పేర్లు అక్కడ రాయాల్సిన అవసరం లేదు. చట్టప్రకారం.. పూజారి అంటే వ్యవసాయంలో కౌలుదారుడు కాదు. దేవుడికి పూజలు చేసే వ్యక్తి. అయితే, దేవస్థానం తరఫున ఆ భూమిని కలిగి ఉంటాడు. దేవుడి ఆస్తులను పరిరక్షిస్తుంటాడు. అంతమాత్రాన అతడు భూస్వామి కాలేడని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
More Stories
బయటపడిన మావోయిస్టుల భారీ ఆయుధాల డంప్
99.1 కోట్లకు చేరిన భారత ఓటర్ల సంఖ్య
మహారాష్ట్రలో పుష్పక్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 12 మంది మృతి