ఎస్సైని బెదిరిస్తున్న వివాదంలో మంత్రి జయరాం!

అక్రమ ఇసుక రవాణా వివాదంలో చిక్కుకున్న  రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం  అక్రమ ఇసుక రవాణా వివాదంలో చిక్కుకున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను వదిలేయాలని ఓ ఎస్సైని బెదిరిస్తున్నట్లుగా ఉన్న ఓ ఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 
 
ఓ కాంట్రాక్టర్ కు ఎమ్మెల్యే అనుచరుడు బెదిరింపులకు పాల్పడిన ఘటన మరువక ముందే.. తాజాగా సాక్షాత్తూ ఏపీ మంత్రి కూడా ప్రభుత్వ అధికారికి బెదిరింపులకు పాల్పడడం దుమారం రేపుతోంది.  కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను స్థానిక పోలీసులు సీజ్ చేశారు.
ఈ వ్యవహారంలో రవాణా చేస్తున్న వ్యక్తులు మంత్రి జయరాంను ఆశ్రయించారు. దీంతో ఎస్సైకి ఫోన్ చేసిన జయరాం.. పట్టుకున్న ట్రాక్టర్లను వదిలేయాలని హుకుం జారీ చేశారు. పట్టుకున్న ట్రాక్టర్లను వదలకుంటే తానే ధర్నాకు దిగుతానని హెచ్చరించారు.
”నాకు జనం ముఖ్యం… ఈసారి కూడా ఇక్కడ నేనే పోటీ చేసేది.. నేను గెలిస్తేనే ఇడ యవ్వారం అయ్యేది, నేను ధర్నాకు దిగాలా.. ట్రాక్టర్లను వదిలేస్తారా ? ” అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇసుక రవాణా చేస్తున్నట్లు ఎవరైనా చూస్తే పట్టుకోండి.. లేదంటే వదిలేయండని ఆదేశించారు.
ఈ ఆడియో లీక్ కావడంతో ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ ఆడియోతో వైసీపీ నేతల ఇసుక అక్రమ రవాణా నిజమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు  తాను ఎవరినీ బెదిరించలేదని మంత్రి జయరాం చెబుతున్నారు. రైతు భరోసా కేంద్రాలు, జగనన్న కాలనీలకు.. ఇసుక తరలిస్తుంటే ఎస్సై అడ్డుకున్నారని బాధితులు తనతో చెప్పారని తెలిపారు. బాధితుల పరిస్థితి చూడలేకే ఆవేదనతో ఎస్సైతో అలా మాట్లాడాల్సి వచ్చిందని మంత్రి వివరణ ఇచ్చారు.