జగన్ ప్రభుత్వంపై కోర్టు ధిక్కారణ చర్యలు!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వానికి హైకోర్టులో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఉపాధి హామీ పథకం బిల్లుల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ పథకం వేతనదారులకు బిల్లులు చెల్లించక పోవడంపై మండిపడింది. ఈ నెల 15వ తేదీలోగా బిల్లులు చెల్లించకపోతే కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది.
విజిలెన్స్‌ విచారణ పేరుతో బిల్లుల చెల్లింపును ఎంతకాలం నిలుపుదల చేస్తారని మండిపడింది. పిటిషనర్లు చేసిన పనుల విషయంలో విచారణ జరుపుతున్నప్పుడు కనీసం వారికి నోటీసులు ఇవ్వకపోవడం ఏమిటని నిలదీసింది. తమ ఉత్తర్వులను ఉల్లంఘించిన అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వం జమచేసిన నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించే విషయంలో సహకరించని సర్పంచ్‌లపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
రెండు వారాల క్రితం 494 కేసుల్లో బిల్లుల చెల్లింపులు చేయాలని ఆదేశిస్తే కేవలం 25 కేసుల్లో మాత్రమే చెల్లింపులు చేయడం పట్ల హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, సర్పంచ్ అకౌంట్లోకి డబ్బులు వేస్తే వారు కాంట్రాక్టర్‌కు చెల్లించడం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో వివరాలు ఇస్తే వారిపై కూడా కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హైకోర్టు తేల్చి చెప్పింది.

ఈ సందర్భంగా కొన్ని కేసుల్లో విచారణ జరుగుతోందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. అయితే, విచారణ జరపకుండానే జరుగుతుందని చెబుతూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపించారు. దీంతో రెండున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు విచారణ ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలు అమలు చేశారా లేదా అనేదే తమకు ముఖ్యమని, ఇతర అంశాలతో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పింది. 
 
విచారణ చేపడితే పిటిషనర్లకు నోటీసులు ఇచ్చారా అని హైకోర్టు ప్రశ్నించింది. రెండున్నరేళ్ల పాటు చెల్లింపులు నిలిపివేస్తే కాంట్రాక్టర్ల జీవనాధారం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. 20 శాతం నుంచి 30 శాతం చెల్లింపులను కట్ చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 15వ తేదీ వరకు ఎవరికి ఎంత మొత్తం చెల్లించారో పిటిషనర్, ప్రభుత్వం వివరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 15వ తేదీ లోపు బిల్లులు చెల్లించకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరించింది.