సుప్రీంకోర్టు జ‌డ్జిలుగా 9 మంది ఒకేసారి ప్ర‌మాణం

సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన తొమ్మిది మంది జడ్జిలు మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కొత్త జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. 
 
సుప్రీంకోర్టులో ఒకేసారి తొమ్మిది మంది జడ్జిలు ప్రమాణస్వీకారం చేయడం చరిత్రలో ఇదే మొదటి సారి కావడం గమనార్హం.  కరోనా కారణంగా ప్రమాణస్వీకార వేదికను ఒకటో కోర్టు ప్రాంగణం నుంచి అదనపు భవనం ఆడిటోరియంలోకి వేదికను మార్చారు. జడ్జిల ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే తొలిసారి. 

సుప్రీం కోర్టు జడ్జిలుగా ప్ర‌మాణం చేసిన వారిలో జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బీవీ నాగరత్నం, జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రవికుమార్‌, జస్టిస్ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ సుందరేష్, జస్టిస్‌ ఏఎస్‌ ఒకా, జస్టిస్‌ విక్రమ్‌నాథ్ లు ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులుగా ముగ్గురు మ‌హిళా న్యాయ‌మూర్తులు ఒకేసారి ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం చ‌రిత్రాత్మ‌కం.  

మ‌హిళా జ‌డ్జీలుగా ప్ర‌మాణం చేసిన‌వారిలో జ‌స్టిస్ హిమా కోహ్లీ, జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న, జ‌స్టిస్ బెలా ఎం త్రివేదిలు ఉన్నారు. ఈ ముగ్గురి చేరిక‌తో సుప్రీంకోర్టులో మ‌హిళా న్యాయ‌మూర్తుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్ప‌టి వ‌రకు సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లో మ‌హిళా జ‌డ్జీలుగా 11 మంది ప‌ని చేశారు.
 
భార‌త మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఈఎస్ వెంక‌ట‌రామ‌య్య కుమార్తె జ‌స్టిస్ బీవీ నాగ‌ర్న‌త‌. క‌ర్నాట‌క హైకోర్టు సీజేగా ఉన్న ఆమె.. అన్నీ అనుకూలిస్తే 2027లో భార‌త తొలి మ‌హిళా ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి. ఒక‌వేళ ఆమె బాధ్య‌త‌లు స్వీక‌రించినా.. కేవ‌లం 36 రోజులు మాత్ర‌మే ఆ విధుల్లో కొన‌సాగే అవ‌కాశం ఉంది
 
వీరి నియామకంతో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య 33కు చేరింది. సుప్రీం కోర్టుకు కొత్త జడ్జిగా నియమితులైన జస్టిస్‌ హిమా కోహ్లీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జడ్జిగా సేవలు అందించారు. ఇటీవల సుప్రీంకోర్టుకు కొత్తగా తొమ్మిది మంది న్యాయమూర్తులను నియమిస్తూ.. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం గెజిట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.