భార‌త సైనికులకు అత్యాధునిక ఎకె 200 రైఫిల్స్

ప్రస్తుతం భారత ప్రభుత్వం ఆయుధ రంగంలో ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు భారత ఆయుధ రంగంలో కనీవిని ఎరుగని రీతిలో కొత్త ఆయుధాలను తయారు చేసి భారత ఆర్మీకి అందుబాటులోకి తీసుకు వస్తుంది. తాజాగా 70 వేల ఏకే 200 సిరీస్ అసాల్ట్ రైఫిల్స్ సైన్యానికి అందించదనం కోసం భారత్, రష్యా ఒప్పందం కుదుర్చుకున్నాయి. గతంలో 7 లక్షల ఏకే-203 రైఫిల్స్ ను సంయుక్తంగా తయారు చేయడానికి రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. కానీ, ఆ ఒప్పందం 2018 నుంచి ఇప్పటికీ పెండింగ్ లో ఉంది. 

రక్షణ, భద్రతా వ్యవస్థ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం 7.62×39 మి.మీ ఏకే-203 రైఫిల్ లో 20,000ను నేరుగా దిగుమతి చేసుకుని, మిగిలిన వాటిలో 6.5 లక్షలను మన దేశంలో సంయుక్తంగా తయారు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించాయి. ఒకవేల ఉమ్మడి ఉత్పత్తి సమయంలో ఆలస్యం అయితే వాటిలో ఎక్కువ వాటిని షెల్ఫ్ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

ఇక ఆఫ్-ది-షెల్ఫ్ ఎక్విప్ మెంట్ లో ఏకే 200 సిరీస్ లో చాలా వేరియెంట్స్ ఉండవచ్చు. రైఫిల్ తయారీ సంస్థ అయిన ఇండో-రష్యా రైఫిల్స్ ప్రయివేట్ లిమిటెడ్ కు చెందిన అధికారుల సమక్షంలో రక్షణ మంత్రిత్వ శాఖ, రష్యన్ ప్రతినిధుల మధ్య ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 

ఈ రైఫిళ్లను ఈ ఏడాది నవంబర్ నుంచి సైనికులకు అంధించనున్నారు. ప్రస్తుతం సైన్యం, నావికాదళం, వైమానిక దళంలో వినియోగిస్తున్న 5.56×45 మి.మీ ఐ.ఎస్.ఎ.ఎస్ (ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్) రైఫిల్స్ స్థానంలో వీటిని భర్తీ చేయనున్నారు. భారత సాయుధ దళాలు 7.62×51 మి.మీ అమెరికన్ సీజీ 716 రైఫిళ్లను కూడా ఉపయోగిస్తున్నాయి. వీటిని ఫ్రంట్ లైన్ పదాతి దళ సైనికులు వినియోగిస్తారు. మిగిలిన వారు ఏకే-203ను ఉపయోగిస్తారు.

వాయుసేనకు అత్యాధునిక చాప్ టెక్నాలజీ 

మరోవంక, భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు శత్రు రాడార్‌ పరిధి నుంచి రక్షించుకొనేందుకు చాఫ్‌ టెక్నాలజీని డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. జోధ్‌పూర్‌లోని డీఆర్‌డీఓ డిఫెన్స్‌ ల్యాబొరేటరీ, పుణేలోని డీఆర్‌డీఓ ప్రయోగశాలలు సంయుక్తంగా ఐఏఎఫ్‌ అవసరాలకు అనుగుణంగా ‘అధునాతన చాఫ్‌ మెటీరియల్, చాఫ్‌ క్యాట్రిడ్జ్‌–118/ఐ’ను అభివృద్ధి చేసింది. 

శత్రువులు ప్రయోగించే రాడార్‌ నిర్దేశిత మిస్సైల్స్‌ను ఇది తప్పుదోవ పట్టిస్తుంది. తద్వారా వాయుసేన విమానాలకు ముప్పు తప్పుతుంది. చాఫ్‌ అనేది యుద్ధ విమానాలను శత్రు రాడార్‌ నుండి రక్షించడానికి ఉపయోగించే ఒక క్లిష్టమైన రక్షణ సాంకేతికత అని రక్షణశాఖ తెలిపింది. 

వ్యూహాత్మక రక్షణ సాంకేతికతల్లో ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ దిశగా  డీఆర్‌డీఓ మరొక అడుగు ముందుకేసిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. భారత వాయుసేనను మరింత బలోపేతం చేసే ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా అభివృద్ధి చేయడానికి సహకరించిన రక్షణ శాఖ ఆర్‌ అండ్‌ డీ కార్యదర్శి, డీఆర్‌డీఓ చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌ రెడ్డి బృందాలను రాజ్‌నాథ్‌ అభినందించారు.