కరోనా కట్టడి కోసం తెలంగాణలో వార్ రూమ్

కరోనాను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా వార్ రూమ్‌ను ఏర్పాటు చేసిందని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తెలిపారు. ప్రధాని మోదీతో తమిళిసై భేటీ అయి రాష్టంలోని తాజా పరిస్థితులను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా  ఎదుర్కోవడంలో సమర్థంగా పని చేసిందని గవర్నర్ కొనియడారు.
 
రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఆమె ప్రధాని మోదీతో పాటు ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు, హోమ్ మంత్రి అమిత్ షా లతో కూడా భేటీ అయ్యారు. కరోనా విపత్కర సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అన్ని విధాలుగా సహకారం అందిందని ఆమె పేర్కొన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  నేతృత్వంలో కేంద్రం సమర్థవంతంగా అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. సలహాలు, మందుల సరఫరా, ఆక్సిజన్ సరఫరా అన్ని విషయాలలో కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సహాయ సహకారాలు అందించిందని సంతోషం వ్యక్తం చేశారు.
కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలపై గవర్నర్‌ స్వయంగా రాసిన ‘పీఎం అండ్‌ పీఎం’ పుస్తకాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రధాని మోదీకి అందజేశారు. పుస్తకంపై మోదీ సంతోషం వ్యక్తంచేశారని తమిళిసై చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా రాష్ట్రప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఆమె చెప్పారు. కరోనాను అరికట్టడానికి హైటెక్ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఉపయోగించుకుందని ఆమె కొనియాడారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానాన్ని, అనుభవాన్ని పుదుచ్చేరిలో ఉపయోగించుకున్నామని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణ, పుదుచ్చేరి మధ్య మంచి అభినావ అనుబంధాన్ని ఏర్పడటానికి ఈ కార్యక్రమం తోడ్పడిందని ఆమె చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల పూర్వ విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నామని గవర్నర్ తెలిపారు.
తాము చదువుకున్న యూనివర్సిటీలకు పూర్వ విద్యార్థులు ఏదో రూపకంగా సహాయ సహకారాలు అందించాలనే ఈ కార్యక్రమం చేపట్టామని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని గిరిజనుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందులో భాగంగానే ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ వివరించారు.