కశ్మీర్‌లో 45 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే జమ్ముకశ్మీర్‌లోని 14 జిల్లాల్లో 45 ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించింది. 

ఎన్‌ఐఏ, సీఆర్‌పీఎఫ్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా నిషేధిత జమాతే ఈ ఇస్లామి సంస్థకు చెందిన సభ్యుల ఇండ్లపై దాడులు నిర్వహించారు. సంస్థపై నిషేధం తర్వాత దాని సభ్యుల కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారు. వేర్పాటువాద, పాకిస్థాన్‌ అనుకూల సంస్థ అయిన జమాతే-ఇ-ఇస్లామిపై కేంద్ర ప్రభుత్వం 2019లో నిషేధం విధించింది.

సీనియర్‌ డీఐజీ నేతృత్వంలో ఢిల్లీ నుంచి వెళ్లిన ఎన్‌ఐఏ బృంధం కశ్మీర్‌లోని శ్రీనగర్‌, బుద్గాం, గండర్‌బాల్‌, బారాముల్లా, కుప్వారా, బందిపోరా, అనంత్‌నాగ్‌, షోపియాన్‌, పుల్వామా, కుల్గాం, రామ్‌బన్‌, దోడా, కిష్ట్‌వార్‌, రాజౌరీ జిల్లాల్లో దాడులు నిర్వహిస్తున్నది. 

గత నెల 31న కూడా కేంద్రపాలిత ప్రాంతంలోని 14 చోట్ల సోదాలు చేపట్టింది. లష్కర్-ఇ-ముస్తాఫా చీఫ్ హిదయాతుల్లా అరెస్టు నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించింది. పుల్వామా, సోఫియాన్, శ్రీనగర్, అనంతనాగ్, జమ్ము, బనిహాల్ ఏరియాల్లో సోదాలు చేశారు.