పాక్ లో వేగంగా క‌రోనా నాలుగో వేవ్

పొరుగు దేశం పాకిస్థాన్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభిస్తున్న‌ది. క‌రోనా నాలుగో వేవ్ ఆ దేశంలో వేగంగా విస్త‌రిస్తున్న‌ది. ముఖ్యంగా సంక్ర‌మ‌ణ రేటు అత్య‌ధికంగా గ‌ల డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతుండ‌టంతో పాకిస్థాన్ స‌ర్కారు అప్ర‌మ‌త్త‌మైంది.

ఈ మేర‌కు కొవిడ్-19 ఆప‌రేష‌న్స్‌ కోసం పాకిస్థాన్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన‌ ది నేష‌న‌ల్ క‌మాండ్ అండ్ ఆప‌రేష‌న్ సెంట‌ర్ క‌రోనా క‌ట్ట‌డికి నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. ఈ కేంద్రం స‌మావేశం అనంత‌రం పాకిస్థాన్ ప్ర‌ణాళికా శాఖ మంత్రి అస‌ద్ ఉమ‌ర్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో అత్యంత వేగంగా ఒక‌రి నుంచి ఒక‌రికి సంక్ర‌మించే డెల్టా వేరియంట్ విస్త‌రిస్తున్న‌ద‌ని వెల్లడించారు.

అదేవిధంగా కొత్త కేసులు, పాజిటివిటీ శాతం కూడా పెరుగుతున్నాయని,  అందుకే కొవిడ్ నిబంధ‌న‌ల‌ను కఠినత‌రం చేయాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. ముఖ్యంగా న‌గ‌రాల్లో వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న‌ద‌ని, అందుకే దేశంలోని ప్ర‌ధాన‌ న‌గ‌రాల్లో ఆంక్ష‌లను పున‌రుద్ధ‌రించామ‌ని ఆయ‌న చెప్పారు.

కాగా, ఆంక్ష‌లు పున‌రుద్ధ‌రించిన న‌గ‌రాల జాబితాలో లాహోర్‌, రావ‌ల్పిండి, ఇస్లామాబాద్‌, ముజ‌ఫ‌రాబాద్‌, మీర్పూర్‌, ఫైస‌లాబాద్‌, ముల్తాన్‌, అబోట్టాబాద్‌, పెషావ‌ర్‌, క‌రాచీ, హైద‌రాబాద్‌, గిల్గిత్‌, స్క‌ర్దు ఉన్నాయి. పైన పేర్కొన్న అన్ని న‌గ‌రాల్లో ఆగ‌స్టు 3వ తేదీ నుంచి ఆగ‌స్టు 31 వ‌ర‌కు ఆంక్ష‌లు కొన‌సాగనున్నాయి.

నూత‌న నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఆయా న‌గ‌రాల్లో మార్కెట్‌లు రాత్రి 10 గంట‌ల‌కు బ‌దులుగా 8 గంట‌ల‌కే మూత‌ప‌డ‌నున్నాయి. అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్థ‌ల్లో 50 శాతం మంది ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ అమ‌ల‌వుతుంది. ప్ర‌జార‌వాణా వాహ‌నాల్లో 50 శాతం మందికే అనుమ‌తి ఉంటుంది. ఇండోర్ డైనింగ్ నిషేధించ‌బ‌డుతుంది. డోర్ డెలివ‌రీ, టేక్ అవేతోపాటు ఔట్ డోర్ డైనింగ్‌కు రాత్రి 10 గంట‌ల వ‌రకు అనుమ‌తి ఉంటుంది.