కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి… కేసీఆర్

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రస్తావిస్తూ కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృష్ణా జలాల వివాదంపై చర్యలు చేపడుతామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.
సోమవారం నాగార్జున సాగర్‌లో పర్యటించిన ఆయన హాలియాలో నిర్వహించిన సభలో నీటి వివాదాన్ని ప్రస్తావిస్తూ  కృష్ణా నీళ్లలో రాబోయే రోజుల్లో మ‌న‌కు ఇబ్బంది జ‌రిగే అవ‌కాశం ఉందని తెలిపారు. ఈ నేప‌థ్యంలో మ‌నం జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు.
పెద్ద‌దేవుల‌ప‌ల్లి చెరువు వ‌ర‌కు పాలేరు రిజ‌ర్వాయ‌ర్ నుంచి గోదావ‌రి నీళ్ల‌ను తెచ్చి అనుసంధానం చేయాల‌నే స‌ర్వే జ‌రుగుతోందని చెప్పారు. అది పూర్త‌యితే నాగార్జున సాగ‌ర్ ఆయ‌క‌ట్టు చాలా సేఫ్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు. పెద్ద‌దేవుల‌ప‌ల్లి – పాలేరు రిజ‌ర్వాయ‌ర్ అనుసంధానం చేసే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.
 దేవరకొండలో ఐదు లిఫ్టులు, మిర్యాలగూడలో ఐదు లిఫ్టులు, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌లో ఒక్కొక్క లిఫ్ట్‌ ఇలా నల్గొండ జిల్లాలో మొత్తం 15 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటన్నింటిని ఏడాదిన్నరలోపే పూర్తి చేసి తీరుతామని సభాముఖంగా ఆయన హామీ ఇచ్చారు. జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించాల్సింది పోయి తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోందని కేసీఆర్ ఆగ్రహించారు.