కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పధకాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకు వెళ్లడంతో పాటు, తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని రాష్ట్రంలోని పార్టీ నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగతం) బి ఎల్ సంతోష్ దిశానిర్ధేశం చేశారు.
‘‘పేదలకు ఇస్తున్న ఉచిత బియ్యంలో రూ.28 ప్రధాని మోదీయే ఇస్తున్నారు. వ్యాక్సిన్ను కేంద్రమే ఉచితంగా పంపిణీ చేస్తోంది. అందువల్ల రేషన్ దుకాణాలు, వ్యాక్సిన్ సెంటర్ల వద్ద మోదీ ఫ్లెక్సీలను పెట్టండి. టీఆర్ఎస్ వాళ్లు తీసేస్తే మళ్లీ పెట్టండి. ప్రధాని మోదీ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి” అంటూ హితవు చెప్పారు.
శనివారం హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మోర్చాలు, పార్టీ ఆఫీస్ బేరర్లు, సీనియర్ నాయకులతో ఆయన విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.
మరోవైపు సంస్థాగత బలోపేతం కీలకమని సూచించారు. ‘‘తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు మనం వ్యూహం రూపొందిస్తున్నాం. అయితే క్షేత్రస్థాయిలో మీరు పనిచేయాలి. తెలంగాణలో 30 వేల బూత్లలో గట్టిగా ఉండాలి. మన లక్ష్యం 2023 ఎన్నికలే” అని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికే సర్వస్వం కాదని, అది పార్టీ కార్యక్రమాల్లో అది ఒక భాగం మాత్రమే అని పేర్కొంటూ అక్కడ పనిచేసినట్లుగానే మిగతా నియోజకవర్గాల్లో కూడా పనిచేయాలని రాష్ట్ర పార్టీ నాయకత్వానికి సంతోష్ దిశానిర్దేశం చేశారు.
బీజేపీ అనుబంధ సంఘాల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. వివిధ మోర్ఛాలు యువకులను పార్టీలో చేరేటట్లు చేయడం కోసం క్రియాశీలకంగా ప్రజా సమస్యలపై కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. పార్టీ కార్యాలయం ఎదుట నాయకుల ఫ్లెక్సీలతో పాటు.. పీవీ సింధు, మీరాబాయి చానుల ఫ్లెక్సీలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
సోషల్ మీడియా ఉంటె నెహ్రు ప్రధాని అయ్యేవారా!
ఇలా ఉండగా, దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు సోషల్ మీడియా ఉండి ఉంటే జవహర్లాల్ నెహ్రూ ప్రధాని అయ్యేవారు కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సోషల్ మీడియా జాతీయ వర్క్షాప్కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటూ నెహ్రూ కారణంగా జమ్మూ కశ్మీర్ సమస్య జటిలం కాగా, సర్దార్ పటేల్ ధైర్యసాహసాలతో హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైందని దుష్యంత్ గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సుష్మాస్వరాజ్ పాత్ర కీలకమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు టీకా ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా ఇన్చార్జ్లు కృషిచేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.
కాగా, బీజేపీ ఎస్సీ మోర్చా కర్ణాటక ఇన్చార్జ్గా సీనియర్ నేత ఎస్.కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన మోర్చా జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మోర్చా తెలంగాణ ఇన్చార్జ్గా జయకుమార్ కాంగేను నియమించారు. ఈ మేరకు పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్సింగ్ ఆర్య ఉత్తర్వులు జారీచేశారు.
More Stories
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై ఈసీ వేటు
పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ 10 లక్షల కోట్లు
సీఎం జగన్పై రాయి దాడి కేసులో సతీష్ అరెస్ట్