మాతృభాషను కోల్పోతే గుర్తింపును, గౌరవాన్ని కోల్పోతాం

మాతృభాషను కోల్పోతే గుర్తింపును, గౌరవాన్ని కోల్పోతామని  ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు హెచ్చరించారు.   మాతృభాషలను కాపాడుకునేందుకు సృజనాత్మక విధానాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని  పిలుపునిచ్చారు.ఎంత సృజనాత్మకంగా మనం భాషను ముందుకు తీసుకువెళతామో, అంతే వేగంగా ముందు తరాలు భాష వైపు ఆకర్షితమౌతాయని తెలిపారు.
 
ప్రభుత్వాలు భాషను కాపాడాలని సంకల్పిస్తే నిధులు ఇవ్వగలదని, అదే సంకల్పం ప్రజలు తీసుకున్నప్పుడే తరతరాలకు మనగలదని దిశానిర్దేశం చేశారు.“తెలుగు కూటమి” సంస్థ నిర్వహించిన భాషాభిమానుల అంతర్జాల సదస్సులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి, మాతృభాషను కాపాడుకునేందుకు ఐదు సూత్రాలను పునరుద్ఘాటించారు. 
 
ప్రాథమిక విద్య మాతృభాషలో అందేలా చూడడం, పరిపాలనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడం, న్యాయస్థాన కార్యకలాపాలు, తీర్పులు మాతృభాషలో అందించడం, క్రమంగా సాంకేతిక విద్యలో మాతృభాషల వినియోగం పెరగడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో కుటుంబ సభ్యులతో తెలుగులోనే మాట్లాడాలని సూచించారు.

ప్రభుత్వాలు తమ కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటాయని, అయితే ప్రజలంతా కలిసి తమ భాషను కాపాడుకునేందుకు ప్రయత్నించినప్పుడు ముందు తరాలకు అందజేయడం సాధ్యమౌతుందని తెలిపారు. 
 
మన సాంస్కృతిక వైవిధ్యాలు, సంప్రదాయాలు, కళలు, సంగీతం, నాట్యం, ఆచారాలు, పండుగలు, సంప్రదాయ విజ్ఞానం, వృత్తుల వారసత్వం లాంటి వాటిని మాతృభాషను కాపాడుకోవడం ద్వారానే పరిరక్షించుకోవచ్చన్న ఉపరాష్ట్రపతి, భాషంటే ఘనమైన వారసత్వమని స్పష్టం చేశారు. 

ఒక పటిష్టమైన భాషా విధానం ఉంటే ఏ భాషనైనా మనం కాపాడుకోవచ్చన్న యునెస్కో తీర్మానాన్ని ఉటంకించిన ఉపరాష్ట్రపతి, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన భాషా విధానాన్ని ప్రకటించడంతో పాటు, ఆచరించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. 
 
నూతన విద్యావిధానంలో మాతృభాషకు పెద్దపీట వేసిన కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించిన ఉపరాష్ట్రపతి, అభ్యాసంతో సంస్కృతి, భాష, సంప్రదాయాలను సమీకృతం చేసినప్పుడే పిల్లలు సమగ్రమైన పద్ధతిలో విద్యను అభ్యసించగలరని స్పష్టం చేశారు. 
 
ఇటీవల నూతన విద్యాసంవత్సరం నుంచి ఎంపిక చేసిన శాఖల్లో పలు భారతీయ భాషల్లో కోర్సులు అందించాలని 8 రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కళాశాలలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించిన ఆయన, వారికి అభినందనలు తెలిపారు. అంతరించిపోతున్న భాషల పరిరక్షణ మరియు ప్రోత్సాహ పథకం ద్వారా మన మాతృభాషల పరిరక్షణ కోసం కేంద్ర విద్యాశాఖ చేస్తున్న ప్రయత్నాలను సైతం ఉపరాష్ట్రపతి అభినందించారు.

ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు భాషాభిమానులు, భాషావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మీడియా మాతృభాష పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి, మాతృభాష పరిరక్షణ కోసం వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాల నుంచి స్ఫూర్తిని పొందాలని సూచించారు. 
 
అన్ని శాస్త్రాలను తమ, తమ భాషల్లో చదువుకుంటున్న ఫ్రాన్స్‌, జర్మనీ, స్వీడన్‌, రష్యా, జపాన్‌, చైనా, ఇటలీ, బ్రెజిల్‌ తదితర దేశాలు అభివృద్ధి చెందిన ఆంగ్లదేశాలతో పోటీ పడుతున్నాయన్న ఆయన, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమతమ మాతృభాషలు సంరక్షించుకునేందుకు అనుసరించిన విధానాలను కూలంకషంగా అధ్యయనం చేసి, మన మాతృభాషల అభివృద్ధికి ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు.

ఏ భాషైనా విశ్వవ్యాపితం కావడానికి, పరిపుష్టి చెందడానికి అనువాదాలు ఎంతో అవసరమన్న ఉపరాష్ట్రపతి, ఇతర భాషల సాహిత్యం తెలుగులోకి అనువాదం అవుతున్నంతంగా తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనువాదం కావడం లేదని, ఇందు కోసం తెలుగు వారంతా చొరవ తీసుకోవాలని సూచించారు.
 
అదే విధంగా ప్రాచీన సాహిత్యాన్ని సరళ తెలుగులో యువతకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం కావాలన్న ఆయన, సాంకేతికంగా భాషా వినియోగం మరింత విస్తృతం కావాలని సూచించారు. వీటితో పాటు మారుమూల గ్రామాల నుంచి భాషాపదజాలాన్ని సమీకరించడం, అంతరిస్తున్న పదాలను వెలికి తీసి కాపాడుకోవడం, శాస్త్ర సాంకేతిక పారిభాషిక పదాలను తయారు చేయడం,వృత్తి పదకోశాలు, మాండలిక పదకోశాలు రూపొందించడం లాంటివిఆవశ్యకమని తెలిపారు