విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలపై ఎన్‌జిటి కమిటీ

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జిటి) విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కొండ్రు మరిడయ్య అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్‌జిటి ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఈ కమిటీలో కేంద్ర అటవీశాఖ నుంచి ఒక సీనియర్‌ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్‌, రాష్ట్ర గనుల శాఖ నుంచి ఒక సీనియర్‌ అధికారి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నుంచి ఒక సీనియర్‌ అధికారి సభ్యులుగా ఉంటారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని ఎన్‌జిటి ఆ కమిటీని ఆదేశించింది.

కాగా, అనుమతులకు మించి మైనింగ్‌ జరుగుతోందని, వేల చెట్లను ధ్వంసం చేసి రోడ్లు వేశారని మరిడయ్య తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఎన్‌జిటి రీజినల్‌ బెంచ్‌.. మైనింగ్‌ పేరిట అక్రమాలు నిజమేనని నిర్ధారించింది.

 
అనుమతించిన పరిధి దాటి విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో మైనింగ్‌ జరిగినట్టు గుర్తించింది. చెట్ల కూల్చివేతను తప్పుబట్టింది. బాధ్యులైన అధికారుల నుంచి పరిహారం వసూలు చేయాలని, అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.