అరుణాచల్‌ ను భారత్‌లో చూపించే మ్యాప్‌లు చైనా స్వాధీనం

అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయ్ చిన్‌ను భారత్‌లో భాగంగా చూపించే వరల్డ్‌ మ్యాప్‌లను చైనా స్వాధీనం చేసుకున్నది. చైనాలో తయారైన సుమారు రూ.50 వేల విలువైన ఈ పటాలను షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశ కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బెడ్‌ కవర్‌ మాదిరిగా కార్గో విమానంలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న 300 ప్యాకేజీలను చెక్-అప్ సమయంలో తనిఖీ చేశారు. బెడ్‌ కవర్లపై ముద్రించిన మ్యాప్‌లపై అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయ్ చిన్‌ను భారత్‌లో భాగంగా చూపించడంపై కస్టమ్స్‌ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మ్యాపులకు సంబంధించి చైనా నిబంధనలను ఉల్లంఘించినందుకు వాటిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు 2019 మార్చిలో షాన్‌డాంగ్‌ తూర్పు ప్రావిన్స్‌లోని కింగ్డావో నగరంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ను భారత్‌లో భాగంగా, టిబెట్‌ను మరో దేశంగా చూపించే 30 వేల ప్రపంచ పటాలను చైనా కస్టమ్స్ అధికారులు ధ్వంసం చేశారు.

కాగా, భారత ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌ దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా వాదిస్తున్నది. అరుణాచల్‌ ప్రదేశ్‌తోపాటు జింజియాంగ్ ఉయిఘూర్ అటానమస్ రీజియన్‌కు చెందిన నైరుతి హోటాన్ కౌంటీలో భాగమైన అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని భారత్‌ ఆక్రమించిందని చైనా ఆరోపిస్తున్నది.