అణు క్షిపణి ప్రయోగకేంద్రాలను  పెంచుతున్న చైనా 

చైనా వ్యూహాత్మకంగా న్యూక్లియర్ మిసైల్ సిలోస్‌ను పెంచుతోందని అమెరికా స్ట్రాటజిక్ కమాండ్ వెల్లడించింది. దాదాపు 250 అండర్‌గ్రౌండ్ మిసైల్ సిలోస్ నిర్మాణంలో ఉన్నట్లు అమెరికన్ సైంటిస్టుల సమాఖ్య పరిశోధకులు తెలిపారు. పశ్చిమ చైనాలో ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా ఓ సిలోను గుర్తించినట్లు తెలిపారు.

ఈ సమాఖ్య వెల్లడించిన వివరాలు గల కథనాన్ని ఓ ప్రముఖ అమెరికన్ ఆంగ్ల పత్రిక ఇటీవల ప్రచురించింది. ఈ కథనాన్ని అమెరికా స్ట్రాటజిక్ కమాండ్ ట్వీట్ చేసింది.  ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్రమైన ముప్పు గురించి, దాని చుట్టూ అలముకున్న రహస్యాల ముసుగు గురించి ఇంత కాలం చెప్తున్నామని, అది ఇప్పుడు బయటపడిందని అమెరికా స్ట్రాటజిక్ కమాండ్ తెలిపింది.

ఈ వేసవి కాలంలో బయటపడినవాటిలో రెండో ఫీల్డ్ జింజియాంగ్‌లోనిదని తెలిపింది. దానికి పొరుగునే ఉన్న గన్సుంగ్ ప్రావిన్స్‌లో మరొక నిర్మాణంలో ఉన్న ఫీల్డ్‌ను జూన్‌లో గుర్తించినట్లు పేర్కొంది. దీనిని కాలిఫోర్నియాలోని జేమ్స్ మార్టిన్ సెంటర్ ఫర్ నాన్ ప్రొలిఫరేషన్ స్టడీస్ గుర్తించినట్లు వివరించింది. ఈ వార్తలపై చైనా స్పందించలేదు.

తాజాగా బయటపడినదాని గురించి ప్రశ్నించినపుడు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పందిస్తూ, దీని గురించి తమకు తెలియదని పేర్కొంది. చైనా ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ఎడిటర్ హు క్సిజిన్ మాట్లాడుతూ, చైనాపై ఒత్తిడి తేవడం కోసం మిసైల్ ఫీల్డ్స్ గురించి అమెరికా సంస్థలు, మీడియా అతిశయోక్తులను ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. చైనా గురించి అమెరికన్ రాజకీయ నాయకులు చెప్తున్న మాటలను గమనించాలని కోరారు.

అదేవిధంగా చైనా సమీపంలో అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల రెచ్చగొట్టే చర్యలను గమనించాలని పేర్కొన్నారు. దేశ భద్రతకు కీలకమైన సైనిక శక్తిని చైనా బలోపేతం చేసుకోవాలని, అణ్వాయుధ నిరోధక వ్యవస్థను పటిష్టపరచాలని సూచించారు. సిలో అంటే క్షిపణిని ప్రయోగించే కేంద్రం. దీనిని భూగర్భంలో నిర్మిస్తారు. దీనినే న్యూక్లియర్ సిలో అని కూడా అంటారు. దీనిలో ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్‌ను భద్రపరచి, అవసరమైనపుడు ప్రయోగిస్తారు. అమెరికా స్ట్రాటజిక్ కమాండ్ ఆ దేశంలోని అణ్వాయుధాలను పర్యవేక్షిస్తుంది.

భారత్‌పై స్పెషల్ ఆపరేషన్‌ 

మరోవంక, గల్వాన్ వ్యాలీలో సైనికుల ఘర్షణతో భారత్, చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ పరిస్థితుల్లో కొంత మేర మార్పు వచ్చినట్లే కనిపించింది. సైనిక, దౌత్య చర్చలు సఫలం కావడంతో ఇరు దేశాల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) నుంచి తమ సైన్యాలను వెనక్కి తీసుకున్నాయి. 

కానీ చైనా మాత్రం వెనక్కి తగ్గనట్లే కనిపిస్తోంది. ఎల్‌ఏసీ వెంబడి మరింత మంది సైనికులను మోహరించాలని భావిస్తున్న చైనా.. అందులో భాగంగా కొత్తగా జవాన్ల రిక్రూట్‌మెంట్‌ను మొదలుపెట్టింది. అది కూడా తమ అధీనంలోని టిబెట్‌‌లో రిక్రూట్‌మెంట్ చేస్తోంది.  

ప్రతి ఇంటి నుంచి ఒకరు ఆర్మీలోకి రావాలని టిబెటన్లను చైనా ఆదేశించినట్లు సమాచారం. టిబెట్ యూత్‌కు ఫిజికల్ టెస్టులు నిర్వహించి వారిని పీఎల్‌ఏలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది. కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉండే లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో భారీగా సైన్యాన్ని మోహరించాలని చైనా యోచిస్తోందని సమాచారం.

టిబెట్‌లో తమకు విశ్వాసంగా ఉండే వ్యక్తుల కుటుంబాల్లో ప్రతి ఇంటి నుంచి ఒకరిని ఆర్మీలోకి రిక్రూట్ చేసుకునే ప్రక్రియను చైనా ఆరంభించిందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇలా రిక్రూట్ చేసుకున్న వారిని భారత్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద శాశ్వతంగా మోహరిస్తారని తెలుస్తోంది. ఎల్‌ఏసీ వెంబడి స్పెషల్ ఆపరేషన్ కోసం టిబెట్ యువతను రిక్రూట్ చేసుకొని, వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని సమాచారం.