మాన్సాస్ ట్రస్ట్ ఈవోపై హైకోర్టు ఆగ్రహం 

మాన్సాస్ ట్రస్ట్ ఈవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవో వెంకటేశ్వరరావు తనకు సహకరించడంలేదని ఛైర్మన్,  మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు వెంకటేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఛైర్మన్ చెప్పినట్లు ఎందుకు వినడంలేదంటూ ఈవోను ప్రశ్నించింది. మాన్సాస్‌ ట్రస్టులో ఈవో పాత్ర ఏంటని ప్రశ్నించింది. ఛైర్మన్ చెప్పిన పనినే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేయాలని ఆదేశించింది. కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడంలేదని కోర్టు మండిపడింది.
ఆడిట్ పేరిట ఎవరో వస్తున్నారని సీనియర్ న్యాయవాది సీతారామమూర్తి న్యాయవాది అశ్విన్ కుమార్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్టేట్ ఆడిట్, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ మాత్రమే మాన్సాస్ ఆడిట్ చేయాలని కోర్టు సూచించింది. ఈ మేరకు ఈవో వెంకటేశ్వరరావుకు నోటీసులు జారీ చేసి కేసు విచారణను వాయిదా వేసింది.
ఇటీవల కాలంలో మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా అశోక్ గజపతిరాజు పునర్ నియమించాలని కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అకోశ్ గజపతిరాజు  మాన్సాస్ ట్రస్టును పరిశీలించేందుకు  అక్కడికి  వెళ్లారు. ఆ సమయంలో ఈవో వెంకటేశ్వరావు సహకరించలేదు. అంతేకాదు మాన్సాస్ ఉద్యోగుల జీతాల విషయంలోనూ వెంకటేశ్వరావు జోక్యం చేసుకున్నారు.
 ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ఛైర్మన్‌గా అశోక్ గజపతిరాజు సూచించినా ఈవో పట్టించుకోలేదు. దీంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన వ్యక్తం చేసిన ఉద్యోగులపైనా ఈవో ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలపై సీరియస్ అయిన ఈవో వ్యవహారంపై అశోక్ గజపతిరాజు కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.