ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో రజత పతకంతో చరిత్ర సృష్టించిన స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు సొంత రాష్ట్రం మణిపూర్లో ఘన స్వాగతం లభించింది. మంగళవారం స్థానిక బీర్ తికేంద్రజీత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మీరాబాయికి అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
విమానాశ్రయానికి విచ్చేసిన మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్సింగ్ మీరాకు పూల బోకేతో స్వాగతం పలికారు. తల్లిదండ్రులు ఓంగ్బీ టాంబీ లైమా, సైఖోమ్ కృతి మితేయిని చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన మీరా కన్నీటి పర్యంతమైంది. కిక్కిరిసిన అభిమానుల కోలహలంలో పోలీసుల భద్రత మధ్య ఈ యువ లిఫ్టర్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగింది.
ఇంఫాల్ వీధుల్లో నుంచి ఊరేగింపు వెళ్తున్న క్రమంలో దారి పొడవున అభిమానులు, స్థానికులు మీరాపై పూల వర్షం కురిపించారు. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం చానును ఘనంగా సన్మానించింది. నజరానా ప్రకటించిన కోటి రూపాయల చెక్తో పాటు అడిషనల్ ఎస్పీ అపాయింట్మెంట్ ఆర్డర్ను మీరాకు సీఎం బిరేన్సింగ్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులతో పాటు చిన్ననాటి కోచ్ అనితా చాను, మంత్రులు పాల్గొన్నారు. సన్మానం ముగిసిన తర్వాత తన స్వగ్రామం నాంగ్పోక్ కాక్చింగ్కు మీరా బయల్దేరి వెళ్లింది. ఇదిలా ఉంటే, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీరాకు రూ.2 కోట్ల నజరానాతో పాటు ప్రమోషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు.
More Stories
అమెరికా లేకపోతే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?
ఐరోపా వెళ్లే భారతీయులకు వీసా సులభం
తైవాన్ లో గంటల వ్యవధిలో 80 సార్లు కంపించిన భూమి