గతంలో హామీలను తుంగలో తొక్కి ఇప్పుడు దళిత బంధు

దళితుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిజాయితీ లేదని, గతంలో దళితులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇప్పుడు దళిత బంధు అంటూ అతి తెలివి ప్రదర్శిస్తున్నారని భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి మండిపడ్డారు. 3 ఎకరాలు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు లాంటి అనేక హామీలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. 

తన ట్విట్టర్ ఖాతా ద్వారా సీఎం కేసీఆర్‌పై ఆమె నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి దళిత బంధు పథకం నిజాయితీతో ప్రకటించినట్లయితే ఎంతైనా అభినందనీయం అని ఆమె పేర్కొన్నారు.

 అయితే, గతంలో దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు లాంటి అనేక హామీలు తుంగలోకి తొక్కడం… దళిత ఉపముఖ్యమంత్రులను అవమానకరంగా ఊడపీకడం వంటి దళిత వ్యతిరేక చర్యల దృష్ట్యా కేసీఆర్ గారిని నమ్మే పరిస్థితులు లేవని ఆమె స్పష్టం చేశారు. 

అట్లనే, దళిత బంధు పథకానికి కేవలం రూ.1200 కోట్లు కేటాయించి, ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పని తెలివితేటలు ప్రదర్శిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్ళ విషయంలో  5 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పలేదని తప్పించుకున్న ఘనత ఈ సీఎం గారిదని ఆమె గుర్తు చేశారు. 

ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇళ్ళు మొత్తం డిమాండ్‌కు చాలినన్ని కట్టలేని ఈ ప్రభుత్వం వెళుతున్న వేగానికి మరో 60 ఏళ్ళు పట్టేట్టుందని చెప్పారు. ఇప్పుడు దళిత బంధు పథకానికి కూడా వీరి కేటాయింపులను బట్టి చూస్తే 160 సంవత్సరాలు పట్టవచ్చని ఆమె చెప్పారు.

ఇక హుజురాబాద్ ఎన్నికల కోసం పైలెట్ ప్రాజెక్ట్ పెట్టినం… ఇది పక్కాగా ఎన్నికల్లో ఓట్ల కోసమే చేస్తున్నాం… అన్న సీఎం గారు… ఇది ఓట్ల పథకం అయినప్పుడు, ఆ నియోజకవర్గంలోని మిగతా కులాలకు చెందిన సుమారు 70 వేల పైచిలుకు కుటుంబాలకు కూడా ఇలా 10 లక్షల చొప్పున నిధుల కేటాయింపు ఎందుకు చెయ్యలేదు?  అని ఆమె ప్రశ్నించారు.

“మిగిలిన వారు మీ ప్రజలు కాదా? వారివి ఓట్లు కావా?” అని ఆమె కేసీఆర్ ను ప్రశ్నించారు.  ఆయా వర్గాల ప్రజలందరూ ఈ విషయమై తమ రూ 10 లక్షలు తమకు ఇచ్చేంతవరకూ గ్రామ గ్రామానా టీఆరెస్ నేతలను నిలదీయాలని విజయశాంతి పిలుపిచ్చారు. స్పష్టమైన దళిత సాధికారతను, దళిత బంధును మనస్ఫూర్తిగా స్పాగతించి తీరుతామని ఆమె స్పష్టం చేశారు. అయితే, ఓట్ల పథకమన్నప్పుడు దానిపై హుజురాబాద్‌లో అన్ని సామాజిక వర్గాల వారికీ హక్కు ఉంటుందని ఆమె తేల్చి చెప్పారు.