ఆలయాలపై వరుస దాడులపై జగన్ పట్టించుకోరే?

ఆలయాలపై వరుస దాడులు జరుగుతుంటే సీఎం జగన్ ఉపేక్షించడంలో అర్థం ఏమిటని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రశ్నించారు. ఇదే వైఖరి కొనసాగితే ప్రభుత్వంతో తాడేపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. 

బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దాలని, వైసీపీ ప్రభుత్వ హిందూ వ్యతిరేక ధోరణిని నిరసిస్తూ, దేవాలయాల సందర్శన కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ముందుగా కృష్ణాతీరంలోని శ్రీశైవక్షేత్రంలోని కోటిలింగేశ్వరస్వామికి పూజాభిషేకాలు నిర్వహించుకొని, అనంతరం, గురుపౌర్ణమి సందర్భంగా, క్షేత్ర పీఠాధిపతి శ్రీశివ స్వాముల వారిని సన్మానించారు. 

అనంతరం ఇంద్రకీలాద్రి మీద ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్లను దర్శించుకుని పూజాకార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత కృష్ణానదీ తీరంలో తొలగించిన ఆయాలు, సీతమ్మవారి పాదాల ప్రాంతాన్ని దర్శించారు. సీఎం జగన్ క్రైస్తవమతాన్ని అన్నివిధాల ప్రోత్సహిస్తూ, హిందూ మతాన్ని పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. 

నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ధనంతో చర్చిలు నిర్మిస్తూ, ఫాస్టర్లకు, ముల్లాలకు జీతాలిస్తున్నారన్నారు. మరోవైపు అచారకశక్తులు ఉ ద్దేశపూర్వకంగా హిందూ ఆలయాలు కూల్చివేత, విగ్రహాల ధ్వంసం, రధాలను దగ్ధంచేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటే, ప్రభుత్వం అదుపుచేయకపోవడంతో హిందువులు తీవ్రంగా ఆక్రోశిస్తురని ఆవేదన చెందారని ఆరోపించారు. 

ఈ సంఘటనలు జరిగి ఏడాది గడచినా రాష్ట్ర ప్రభుత్వం దోషులను ఇంతవరకూ పట్టుకోక చెవుల్లో పూలు పెడుతోందని దయ్యబట్టారు. కృష్ణ పుష్కరాల సందర్భంగా కూల్చివేసిన 40 గుడులను కడుతున్నామని అంటూ కేవలం 1,400 గజాల్లో ఉన్న గుడికి వంద గజాల్లో కడుతూ కంటితుడుపు చర్యలు చేస్తున్నారని విమర్శించారు.

ఆర్ధిక పరిస్థితి సజావుగా లేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒక కుటుంబంగా భావిస్తూ, కుటుంబ ఆర్థికపరిస్థితి ఏ మాత్రం సజావుగా లేదని సోమువీర్రాజు ధ్వజమెత్తారు.  జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని చెబుతూ  అధికారంలోకి వచ్చిన వెంటనే జీపిఎఫ్ను, సిపిఎసన్ను రద్దుచేస్తామని, తాత్కాలిక కార్మికులను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీలు నీటిమూడలేనా అని ప్రశ్నించారు.

రెండేళ్లలో సచివాలయం ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పి గ్రూప్ -1 కన్నా కష్టమైన పరీక్ష పాసవ్వాలని నిబంధన విధించి వారికి చుక్కలు చూపిస్తున్నారని ఆక్షేపించారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇచ్చే పెన్షన్లు, గ్రాట్యుటీ, బీమా వంటి ఆర్జితాలు రూ.3 వేల కోట్లు బకాయిలు చెల్లించకపోవడం దారుణమని పేర్కొన్నారు.

సచివాలయాలకు ముఖ్యమంత్రి, అధికారులు వెళ్లడం లేదని, ఏడాది నుంచి ఒక్క ఫైల్ క్లియర్ కాలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం కొన్ని నిర్దేశిత కార్యక్రమాల కోసం తప్ప మిగతావి వదలివేసి జబ్బలు చరుచుకుంటోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తల్లకిందులైందని, 1, 2 ఏళ్లలో జీతాలు కూడా ఇవ్వలేరనేది సందేహం కలిగిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు ఇంకా 20 శాతం మందికి జీతాలు ఇవ్వలేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

గుంటూరు జిల్లా కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో  సోము వీర్రాజు, ఇతర నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతర్వేదిలో రథం దగ్ధం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు, ఈ సీఎం హిందూ వ్యతిరేక ఎజెండాను అనుసరిస్తున్నట్లు ఎవరికైనా అర్ధమైపోతుందని ఈ సందర్భంగా వీర్రాజు విమర్శించారు.

సంవత్సర కాలంగా ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, జీతాలు ఇవ్వలేని విధంగా ప్రభుత్వం అప్పులు చేయడం ముఖ్యమంత్రి అలవాటు గామారిందని ఆరోపించారు.