ప్రియా మలిక్‌‌కు స్వర్ణం.. అదరగొట్టిన మేరీ కోమ్‌!

కేడెట్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత జూనియర్ రెజ్లర్ ప్రియా మలిక్ బంగారు పతకం కైవసం చేసుకుంది. హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న పోటీల్లో మలిక్ 73 కేజీల కేటగిరీలో ఆదివారం స్వర్ణం కొల్లగొట్టింది. బెలారస్‌కు చెందిన సేనియా పటపోవిచ్‌తో జరిగిన పోరులో 5-0 విజయం సాధించి పసిడి పతకాన్ని మెడలో వేసుకుంది. 
 
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజత పతకం సాధించిన మరునాడే ప్రియా మలిక్ స్వర్ణం కొల్లగొట్టడం గమనార్హం. ప్రియ గెలపుతో సోషల్ మీడియా శుభాకాంక్షలతో హోరెత్తిపోతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత చౌతాలా ఆమెను అభినందించారు. పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేస్తూ ప్రియా మలిక్ దేశానికి గర్వకారణంగా నిలిచిందని కొనియాడారు.

మరోవంక, భారత బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ ఒలింపిక్స్‌లో అదరగొట్టింది. ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన కోమ్.. రౌండ్-32 మ్యాచ్‌లో ప్రత్యర్థి మిగెలీనా హెర్నాండేజ్ గార్సియాతో వ్యూహాత్మకంగా పోరాడి విజయం సాధించింది. మహిళల ఫ్లైవెయిట్ విభాగంలో డొమినికన్ రిపబ్లిక్ క్రీడాకారిణిని 4-1 తేడాతో ఓడించింది. 

వయసులో మేరీ కోమ్ కంటే దాదాపు 15 ఏళ్లు చిన్నదైన గార్సియా తొలి నుంచీ దూకుడు ప్రదర్శించినా..చిట్టచివరకు విజయం మేరీ కోమ్‌నే వరించింది. తదుపరి జరగనున్న ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో మేరీ కోమ్..కొలంబియాకు చెందిన ఇంగ్రిట్ వాలెంషియాతో తలపడతారు.

 ఇండియ‌న్ టేబుల్ టెన్నిస్ స్టార్ మ‌నికా బాత్రా ఒలింపిక్స్ సింగిల్స్ ఈవెంట్‌లో మూడో రౌండ్ చేరుకుంది. రెండో రౌండ్‌లో ఆమె పోరాడి గెలిచింది. 20వ సీడ్ ఉక్రెయిన్ ప్లేయ‌ర్ పెసోట్‌స్కాపై 4-3 గేమ్స్ తేడాతో విజ‌యం సాధించింది. తొలి రెండు గేమ్‌ల‌ను కోల్పోయినా కూడా మ‌నికా అద్భుతంగా పోరాడి 3, 4తోపాటు 6, 7 గేమ్స్‌లో గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. గంట పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 4-11, 4-11, 11-7, 12-10, 8-11, 11-5, 11-7 తేడాతో మ‌నికా బాత్రా గెలిచింది.

 స్టార్‌ షెట్లర్‌ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో శుభారంభం పలికింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో ఇజ్రాయిల్‌ షట్లర్‌పై ఘన విజయం సాధించింది. ఇజ్రాయిల్‌ క్రీడాకారిణి సెనియా పొలికర్‌పోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుస గేమ్స్‌లో గెలుపొందింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత స్టార్‌ షెట్లర్‌కు పొలికర్‌ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. దీంతో సింధు 21-7, 21-10తో విజయం సాధించింది.

 అయితే, ఒలింపిక్స్ హాకీ పూల్ ఎలో భాగంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా చిత్తుగా ఓడింది. ఆసీస్ ఏకంగా 7-1 గోల్స్‌ తేడాతో గెల‌వ‌డం విశేషం. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి శుభారంభం చేసిన ఇండియ‌న్ టీమ్‌.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు క‌నీస పోటీ ఇవ్వ‌లేకపోయింది.