క్విట్ ఇండియా తరహాలో ఇండియా జోడో ప్రచారం 

రాబోయే ఆగస్టు 15న 75 వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగిడబోతున్నందున ‘అమృత్ మహోత్సవ్’ నిర్వహిస్తున్న సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్’ అనే నినాదాన్ని ఇచ్చారు. క్విట్ ఇండియా ప్రచారం తరహాలో దేశ ప్రజలు `ఇండియా జోడో’ ప్రచారాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఆదివారం ఉదయం మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ రేడియో కార్యక్రమం 79 వ ఎపిసోడ్. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత అథ్లెట్లను ఉత్సాహపరిచడం గురించి కూడా మోదీ మాట్లాడారు. కార్గిల్ అమరవీరులను గుర్తు చేసుకున్నారు.  దేశం శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న 75 సంవత్సరాల స్వేచ్ఛను మనం అనుభవిస్తున్నాం. ఇది మన అదృష్టం. ఈ సందర్భంగా ‘అమృత్ మహోత్సవ్’ బాపు సబర్మతి ఆశ్రమం నుంచి మార్చి 12 న ప్రారంభమైంది. ఇదే రోజున బాపు దండి యాత్రను కూడా పునరుద్ధరించబడింది. 

అప్పటి నుంచి జమ్ముకశ్మీర్ నుంచి పుదుచ్చేరి వరకు, గుజరాత్ నుంచి ఈశాన్యం వరకు.. అమృత్ మహోత్సవ్‌కు సంబంధించిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ‘అమృత్‌ మహోత్సవ్‌’ రాజకీయ కార్యక్రమం కాదు. దేశ ప్రజలకు చెందినది. ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు.

స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆగస్ట్‌ 15 న చేపడుతున్న జాతీయ గీత ప్రచారంలో చేరాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ రోజున ఎక్కువ మంది భారతీయులు జాతీయ గీతాన్ని ఆలపించాలన్నారు. దీని కోసం rashtragaan.in ఒక వెబ్‌సైట్ కూడా సృష్టించబడిందన్నారు. దీని సహాయంతో ఎవరైనా జాతీయ గీతం పాడి రికార్డ్‌ చేయవచ్చునని చెప్పారు.

ఈ సందర్భంగా ఒడిశా, తమిళనాడుతోపాటు దేశవ్యాప్తంగా వినూత్నమైన పనులను చేపడుతున్న వారిని మోదీ ప్రశంసించారు. ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌ ప్రాధాన్యతనిస్తూ చేనేత, ఖాదీ వస్త్రాలను ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

రేపు కార్గిల్ విజయ్ దివాస్. ఇది భారత సైన్యం ధైర్యానికి చిహ్నం. కార్గిల్ కథ ప్రజలంతా చదివి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కార్గిల్‌ హీరోలకు వందనం’ అని మోదీ చెప్పారు. 1999 లో మన దేశం కోసం సర్వస్వాన్ని అర్పించిన జవాన్లకు నివాళులు అర్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్గిల్ యుద్ధం దేశ సాయుధ దళాల శౌర్యానికి, క్రమశిక్షణకు చిహ్నమని పేర్కొన్నారు.

ఒలంపిక్స్ క్రీడాకారులకు మద్దతుగా ఇప్పటికే ప్రారంభమైన ‘విక్టరీ పంచ్ క్యాంపెయిన్’ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆటగాళ్లకు మద్దతుగా సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ క్యాంపెయిన్ ప్రారంభమైందని, అందరూ తమ తమ టీమ్‌తో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఆటగాళ్లందరూ చాలా కష్టపడి టోక్యోకు చేరుకున్నారని, ప్రజలు తెలిసో, తెలియకో వారిపై ఎలాంటి ఒత్తిళ్లూ చేయకూడదని మోదీ కోరారు.

దేశ ప్రజలందరూ భయాన్ని వీడి, వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావాలని మోదీ మన్ కీ బాత్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ‘‘దయచేసి భయాన్ని వీడండి. వ్యాక్సిన్ తీసుకోండి. కొందరికి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జ్వరం వచ్చింది. కానీ ఇది చాలా చిన్నది. కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. వ్యాక్సిన్‌ను నిరాకరించడం చాలా అపాయం. వ్యక్తిగతంగానూ క్షేమం కాదు. సమాజపరంగా కూడా క్షేమం కాదు.. దయచేసి అందరూ వ్యాక్సిన్ తీసుకోండి’’ అని మోదీ విజ్ఞప్తి చేశారు.