జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్రపతి నేటి నుండి పర్యటన

జమ్మూ కశ్మీర్‌లో నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ పర్యటించనున్నారు.  రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జమ్ము కశ్మీర్‌లో త్రివిధ దళాల అధిపతిగా ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కశ్మీర్‌లో పర్యటిస్తారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి జమ్ముకశ్మీర్‌, లద్దాక్‌లో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 
 
అందులో భాగంగా ఈ నెల 26వ తేదీన కార్గిల్ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం 27వ తేదీన కశ్మీర్ విశ్వవిద్యాలయం 19వ స్నాతకోత్సవం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
 
వాస్తవంగా 2019లోనే రాష్ట్రపతి పర్యటించాల్సి ఉండగా అప్పుడు వాతావరణం సహకరించక పర్యటన రద్దయ్యింది. ఇప్పుడు ఈసారి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జమ్మూ కశ్మీర్‌ విభజన అనంతరం రాష్ట్రపతి తొలిసారిగా పర్యటించనుండడం విశేషం.  జమ్మూ, లఢక్‌గా 2019లో కేంద్ర ప్రభుత్వం విభజించిన విషయం తెలిసిందే.
 
 ప్రస్తుతం కశ్మీర్‌ లోయలో శాంతియుత వాతావరణం ఏర్పడింది. ఉగ్రవాద సమస్యతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ హిమాలయ ప్రాంతంలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి కాగలదు. 
 
కాగా, తమిళనాడు అసెంబ్లీ శతవార్షికోత్సవంలో ఆగస్టు 2వ తేదీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొనబోతున్నారని, ఆ రోజు సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చిత్రపటాన్ని ఆవిష్కరిస్తారని అసెంబ్లీ స్పీకర్‌ అప్పావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌, ముఖ్యమంత్రి స్టాలిన్‌ పాల్గొంటారని, కార్యక్రమ ఏర్పాట్లను అసెంబ్లీ కార్యదర్శి పర్యవేక్షిస్తున్నారని స్పీకర్‌ అప్పావు తెలిపారు.