రెండేళ్ల పదవీ కాలంలో అనేక సవాళ్లు…

ముఖ్యమంత్రిగా తన రెండేళ్ల పదవీ కాలంలో మొదటి రోజు నుండి అనేక సవాళ్ళను ఎదుర్కొంటు వచ్చానని బి ఎస్ యడియూరప్ప తెలిపారు. గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో వరదలు, కరోనా మహమ్మారి సృష్టించిన సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల జీవితాలను మెరుగు పరచడం కోసం తాను నిజాయతీతో ప్రయత్నం చేశానని సంతృప్తి వ్యక్తం చేశారు. 
 
సోమవారంతో తాను పదవి నుండి వైదొలగవచ్చని కొద్దీ రోజుల క్రితం సంకేతం ఇచ్చిన ఆయన తన స్వస్థలమైన శివమొగ్గ జిల్లా, తనను ఎన్నుకున్న షికారిపురా నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అభివృద్ధిని భరోసా ఇవ్వడం ద్వారా వారి ఋణం తీర్చుకొంటున్నందుకు గర్వంగా ఉన్నదని చెప్పారు.

రూ 1,074 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి, శివమొగ్గ జిల్లాలో రూ 560 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు పునాది వేసిన అనంతరం ఆయన తన ఇంటి కార్యాలయం నుండి మాట్లాడారు. “గత రెండేళ్ళలో శివమొగ్గ జిల్లా అభివృద్ధికి గరిష్ట ప్రయత్నాలు చేశానని నేను సంతృప్తి చెందుతున్నాను. ప్రారంభిస్తున్న ప్రాజెక్టులు దానికి సాక్ష్యం” అని పేర్కొన్నారు.

ప్రత్యేకంగా తనకు రాజకీయ జన్మనిచ్చిన షికారిపురా తాలూకా అని గర్వంగా భావిస్తున్నానని యడియరప్ప చెప్పారు. “నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఇప్పటి వరకు, రాష్ట్రం గతంలో ఎన్నడూ ఎదుర్కొని ప్రకృతి వైపరీత్యాలు,  జీవితాలను నాశనం చేసిన కరోనా మహమ్మారి వంటి అనేక సవాళ్లను నేను ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు మరోసారి వరద పరిస్థితి కనిపిస్తున్నది ”అని యడియరప్ప పేర్కొన్నారు.

శివమొగ్గతో సహా ఎనిమిది జిల్లాల డిప్యూటీ కమిషనర్లతో మాట్లాడి, సహాయ, సహాయక చర్యలు చేపట్టమని వారికి ఆదేశించానని తెలిపారు.  పలు . సవాళ్లను ఎదుర్కోవడంలో తనకు  సహకరించినందుకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం తన పదవిలో చివరి రోజు కావచ్చని సూచిస్తూ, జూలై 25 న కేంద్ర నాయకులు తన  ఇచ్చే సూచనల ఆధారంగా జూలై 26 నుంచి “తన పనిని” ప్రారంభిస్తామని యడియరప్ప ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ఆయన ప్రభుత్వం జూలై 26 న రెండేళ్ల పదవిని పూర్తి చేస్తుంది.

షికారిపురలో పురసభ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన యెడియరప్ప 1983 లో మొదటిసారి షికారిపుర నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. అక్కడ నుండి ఎనిమిది సార్లు విజయం సాధించారు. ముఖ్యమంత్రి పెద్ద కుమారుడు బి వై రాఘవేంద్ర శివమొగ్గ లోక్ సభ నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మౌలిక సదుపాయాల కల్పన, పొలాలకు నీటిని అందించే నీటిపారుదల పనులు, శివమొగ్గలోని సరస్సులను నింపడం వంటి అనేక కార్యక్రమాలను ప్రస్తావించిన యడియరప్ప  జిల్లాలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు రోజుల్లో రైతుల ఆర్థిక పరిస్థితి మారగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.

సోగనే గ్రామంలో శివమొగ్గ విమానాశ్రయం పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్న ఆయన, రూ 384 కోట్ల వ్యయంతో  విమానాశ్రయం ఎయిర్‌బస్ విమానాలను నడపడానికి ఆచరణీయమని, పర్యాటక రంగం, పరిశ్రమలు, ఉపాధి కల్పన పరంగా పొరుగు జిల్లాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. వచ్చే ఏప్రిల్ నాటికి విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ఆయన వెల్లడించారు.