పెగాసస్, ఇతర సమస్యలపై పార్లమెంట్ ఉభయసభల్లో మూడవ రోజు కూడా హైడ్రామా నడిచింది. ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్, మీడియా సంస్థలపై ఐటి సోదాలపై విపక్ష ఎంపిలు ఆందోళనలు కొనసాగించారు. రాజ్యసభలో గురువారం విపక్ష సభ్యుల విమర్శలతో ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ పెగాసస్ స్పైవేర్ అంశంపై ప్రకటన చేస్తున్న సమయంలో.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అనుచితంగా వ్యవహరించారు
పెగాసస్ గురించి మాట్లాడేందుకు వైష్ణవ్ లేవగానే తృణమూల ఎంపి శాంతన్ ఆయన చేతిలోని పత్రాలను లాక్కొని, చించేసి, డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ వైపు విసిరారు. టీఎంసీ ఎంపీల వైఖరిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ఎంపీల ప్రవర్తన తీరును డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఖండించారు. గందరగోళం నడుమ ఆయన సభను రేపటికి వాయిదా వేశారు. గతంలోనూ టీఎంసీ ఎంపీలు.. నూతన రైతు చట్టాలను ప్రవేశపెడుతున్న సమయంలో.. చైర్ మైక్ లాగేసిన విషయం తెలిసిందే.
దీంతో కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పురతి, ఎంపీ శంతను సేన్ మధ్య మాటల ఘర్షణ కొనసాగింది. టీఎంసీ ఎంపీల ప్రవర్తనను బీజేపీ ఎంపీ స్వపన్దాస్ గుప్తా ఖండించారు. మంత్రి చేతుల్లోంచి పేపర్ లాగేసిన అంశాన్ని ప్రశ్నించగా.. ఎంపీ ఎంపీ సుకేందు శేఖర్ రాయ్ సమాధాన్ని దాటవేశారు.
టిఎంసిని లక్ష్యంగా చేసుకుని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ సంఘటన ‘అవమానకరం’ అంటూ ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయిన @AITCofficial వాంటన్ పోకిరివాదం ఇప్పుడు పెద్దమనిషి మంత్రి అశ్విని వైష్ణవ్కు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రదర్శించబడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
“భూమి సంబంధ చట్టాలు తనకు లేదా తన పార్టీకి వర్తించవని నమ్మే మమతా బెనర్జీ తమ పార్టీ వారిని ఈ విధంగా సిగ్గులేని ప్రవర్తనకు ప్రోత్సహిస్తున్నారు” అంటూ చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఘటనపై మరో కేంద్రమంత్రి మీనాక్షీ లేఖీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష పార్టీల సభ్యులు పూర్తిగా దిగజారిపోయారని.. ముఖ్యంగా టీఎంసీ, కాంగ్రెస్ పార్టీల సభ్యులైతే రాజకీయ ప్రత్యర్థులుగా అత్యంత నీచస్థాయికి పడిపోయారని ఆమె విమర్శించారు.
పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు దేశ పరువు, మర్యాదలను మంటగలిపేదిగా ఉన్నదని మీనాక్షీ లేఖీ మండిపడ్డారు. ఇవాళ సభలో ఐటీ మంత్రి ప్రకటన చేస్తుండగా ఓ సభ్యుడు ఆయన చేతిలోంచి పత్రాలను లాక్కుని చించి పారేయడం ఎంతవరకు సబబు..? అని లేఖీ ప్రశ్నించారు.
కాగా, ‘పెగాసస్ స్పైవేర్’ వంటి నివేదికలన్నింటినీ పార్టీలన్నీ ఇప్పటికే ఖండించాయని, అసలు ఆ రిపోర్టులో ఏముందో మొదట సభ్యులందరూ చదవితే బాగుంటుందని అశ్వినీ వైష్ణవ్ తన ప్రకటనలో ప్రతిపక్షాలకు చురకలంటించారు. పెగాసస్పై గతంలోనూ ఇలాంటి ఆరోపణలే వచ్చాయని, అలాంటి వాటికి ఎలాంటి ఆధారాలు లేవని, వాటిని అన్ని పార్టీలూ ఖండించాయని గుర్తు చేశారు.
సుప్రీం కోర్టు కూడా వీటిని తిరస్కరించిందని గుర్తు చేశారు. పెగాసస్కు సంబంధించిన స్టోరీ ఓ వెబ్ పోర్టల్లో అచ్చైందని, ఈ కథనం విషయంలో చాలా ఆరోపణలు చుట్టుముట్టాయని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని, ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలను కించపరిచే ప్రయత్నంగా ఈ రిపోర్టు కనిపిస్తోందని అశ్వినీ వైష్ణవ్ దుయ్యబట్టారు.
అత్యంత సంచలనాత్మక కథను ఓ వెబ్ పోర్టల్ జులై 18..2021న ప్రచురించిందని, ఈ కథనం చుట్టూ చాలా ఆరోపణలు ఉన్నాయని, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఒక రోజు ముందు.. ఇదేమీ యాదృచ్చికం కాదంటూ మంత్రి ముగించారు. దీంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. విపక్షాల ఆందోళనలతో గురువారం రాజ్యసభ మూడు సార్లు వాయిదా పడింది. ఆర్జేడీ నేత మనోజ్ ఝా మాట్లాడుతూ విపక్షాల ఆందోళన మధ్య ఐటి శాఖ మంత్రి ప్రకటన చేయడం, సమస్యను ఎగతాళి చేయాలని కేంద్రం చూస్తున్నట్లు అర్థమౌతుందని వ్యాఖ్యానించారు.
ఇదిలావుండగా, ప్రతిపక్ష సభ్యుల నినాదాల నేపథ్యంలో లోక్సభ కార్యకలాపాలను మూడోసారి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు, చైర్లో ఉన్న భా\ర్తుహరి మహతాబ్, నిరసన వ్యక్తం చేసిన సభ్యులను తిరిగి తమ తమ సీట్లకు వెళ్లి చర్చలో పాల్గొనమని కోరారు. వారు వినక పోవడంతో సభను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేశారు. తరువాత, రోజుకు వాయిదా పడింది.
పెగాసస్తో పాటు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిసస్తూ మమతా ఎంపిలతో పాటు అకాలీదళ్ ఎంపిలు ఆందోళనలకు దిగారు. వీటికి ప్రధాని మోదీ సమాధానాలనివ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనలు కొనసాగుతుండగానే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ఏ అంశంపైనైనా చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
More Stories
త్వరలో భారత్లోకి ఎయిర్ట్యాక్సీలు
తొలి దశలో 62.37 శాతం మాత్రమే పోలింగ్
సైద్ధాంతికంగా కాంగ్రెస్, లెఫ్ట్ దివాలా