డీఆర్‌డీవో ఆకాష్‌ మిసైల్‌ ప్రయోగం విజయవంతం

భూ ఉపరితలం నుంచి గాల్లోని లక్ష్యాలను ఛేదించగల కొత్త తరం ఆకాష్‌ మిసైల్‌ను బుధవారం రోజున డీఆర్‌డీవో విజయవంతంగా ప్రయోగించింది.  ఈ ప్రయోగాన్ని ఒడిషా తీరాన ఉన్నఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌లో ప్రయోగించారు. మిసైల్‌కు సంబంధించిన ఫ్లైట్‌ డేటా ప్రకారం టెస్ట్‌ విజయవంతమైందని డీఆర్‌డీవో నిర్థారించింది.
 
ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్, రాడార్, టెలిమెట్రీ వంటి అనేక పర్యవేక్షణ విధానాలను టెస్ట్‌రేంజ్‌లో ఏర్పాటు చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 12 . 45 నిమిషాలకు ఆకాష్‌ మిసైల్‌ను పరిక్షించినట్లు పేర్కొంది.
కొత్తగా అప్‌డేట్‌ చేసిన ఈ మిసైట్‌ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నలక్ష్యాలను మాక్‌ 2.5 వేగంతో ఛేదించగలదని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కొత్త క్షిపణి వ్యవస్థను హైదరాబాద్‌కు చెందిన డీఆర్‌డీవో ల్యాబ్‌ అభివృద్ధి చేసింది.
మ్యాన్ పోర్టబుల్ లాంచర్ ద్వారా ప్రయోగించిన ఈ క్షిపణి నిర్దిష్ట లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్‌డీఓ వర్గాలు తెలిపాయి. సమీపంలోని లక్ష్యాలను క్షిపణి కచ్చితంగా ఛేదించగలదని ఈ ప్రయోగంలో రుజువైందని పేర్కొన్నాయి. ఇక సుదూర టార్గెట్లకు సంబంధించి గతంలో జరిగిన పరీక్షలు విజయవంతమైన విషయం తెలిసిందే.
 
 ఈ మిస్సైల్‌లో అత్యాధునిక ఇన్‌ఫ్రా రెడ్ సీకర్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఉన్నాయని డీఆర్‌డీఓ పేర్కొంది. ఆకాష్‌-ఎన్‌జీ క్షిపణి ఆయుధ వ్యవస్థతో భారత వైమానిక దళానికి మరింత బలం చేకూరతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించినందుకుగాను డీఆర్‌డీవో, భారత వైమానిక దళం, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ సంస్థలకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందనలను తెలిపారు.