పోలవరంపై ఉన్న శ్రద్ధ.. నిర్వాసితులపై లేదు

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతవాసులపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏ మాత్రం శ్రద్ధ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. సీఎం జగన్ పోలవరం పర్యటన కేవలం ఓట్ల కోసమే అని విమర్శించారు.

సీఎం పోలవరం షెడ్యూల్ చూస్తే దేనికో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.  పోలవరం ప్రాజెక్టుపైన ఉన్న శ్రద్ధ, ఆ ప్రాజెక్టు కట్టడానికి తమ సర్వస్వాన్ని వదులుకున్న ముంపు ప్రాంతా వాసులపై లేదని ఆరోపించారు. సీఎం ధోరణిని బీజేపీ సహించదని స్పష్టం చేశారు.

పోలవరం పర్యటనలో సీఎం కొంత సమయం అయినా పునరావాస ప్రాంతాలలో పర్యటించి, వారు పడుతున్న అనేక అవస్థలను ప్రత్యక్షంగా చూడాలని కోరారు. వారి పరిస్థితిపై అధికారులతో సమీక్షించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.