లష్కరే కమాండ్‌, మరో తీవ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున షోపియాన్‌ జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా కమాండర్‌ సహా ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. 

షోపియాన్‌లోని చెక్‌సాదిఖ్‌ ఖాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులు జరిపారని, ప్రతిగా భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ చెప్పారు. 

ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా కమాండర్‌ ఇష్ఫక్‌ దార్‌ అలియాస్‌ అబూ అక్రమ్‌తోపాటు మరో ఉగ్రవాది చనిపోయాడని తెలిపారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు.

లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో 2017 నుంచి కమాండర్ ఇష్ఫాక్ దార్ అలియాస్ అబు అక్రమ్ దాడులకు వ్యూహరచనలు చేస్తున్నాడు. ఘటనా స్థలం నుంచి మందు గుండు సామాగ్రి, తుపాకులు స్వాధీనం చేసుకున్నామని ఐజిపి విజయ్ కుమార్ తెలిపాడు. శుక్రవారం శ్రీనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా ఇద్దరు తీవ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.