రాజీనామా పుకార్లను కొట్టేసిన యడియూరప్ప !

ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేసిన్నట్లు వస్తున్న పుకార్లను కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎస్ యడ్యూరప్ప కొట్టిపారవేసారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి అధ్యక్షుడు  జె పి నడ్డాలను కలుస్తున్న ఆయనను రాజీనామా చేశారా అని కర్ణాటక భవన్ వద్ద అడిగినప్పుడు  “అదేమీ లేదు. శనివారం బిజెపి అగ్ర నాయకత్వంతో సమావేశమైన తర్వాత తిరిగి బెంగళూరుకు వస్తాను” అని స్పష్టం చేశారు.

కర్ణాటకలోని పార్టీ ఎమ్యెల్యేలు చాలామంది ఆయన రాజీనామా కోరుతున్నారని, పైగా  2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు యెడియరప్ప (79) స్థానంలో మరొకరిని ముఖ్యమంత్రిగా ప్రజలకు పరిచయం చేయవలసిన అవసరం ఉన్నదని వస్తున్న కధనాల నేపథ్యంలో రాజీనామా కోసమే పార్టీ అధిష్ఠానం ఆయనను ఢిల్లీ పిలిపించినదని వస్తున్న కథనాలను ఆయన తోసివేసారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో శుక్రవారం భేటీ అయిన ఆయన కేబినెట్ పునర్నిర్మాణంపై చర్చించారా అని అడుగగా “కేబినెట్  పునర్నిర్మాణం లేదా విస్తరణపై (పార్టీ) సీనియర్లతో అలాంటి చర్చ ఏదైనా ఉంటే నేను మీకు చెప్తాను” అని తెలిపారు. రాష్ట్రానికి చెందిన వివిధ సమస్యలపై మాత్రమే ప్రధానితో చర్చించినట్లు స్పష్టం చేశారు.  కావేరి నదికి అడ్డంగా ఉన్న మేకెడాటు ప్రాజెక్టుతో సహా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర పనులపై చర్చించి న్నట్లు చెప్పారు.