అభివృద్ధికి, సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకం అని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. యూనివర్సిటీలు పరిశోధనలను, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలతో పాటు, ఎంటర్ప్రీన్యూరియల్ నైపుణ్యాలు కూడా పెంపొందించాలని పేర్కొన్నారు.
తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జాతీయ విద్యా విధానం 2020: కామర్స్ బిజినెస్ ఎడ్యుకేషన్ దృక్పదాలు’ అన్న అంశంపై జరిగిన జాతీయ వెబినార్లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొంటూ జాతీయ విద్యా విధానం 2020 భారతదేశంలోని విద్యా వ్యవస్థను 21వ శతాబ్దం అవసరాలకనుగుణంగా తీర్చిదిద్దడానికి రూపొందించారని తెలిపారు.
ఆత్మనిర్బర్ భారత్ గా ఎదగాలంటే ఉన్నత విద్యా వ్యవస్థలో ఉతృష్టత, విద్యార్థులలో నైపుణ్యాలు అత్యంత ఆవశ్యకమని చెప్పారు. భారతదేశంలో ఈ కామర్స్ బిజినెస్ చాలా వేగంగా ఎదుగుతుందని, ఈ విస్తరణలో అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఈ- కామర్స్ విద్యపై కూడా దృష్టిసారించి భవిష్యత్ నాయకులను తయారు చేయాలని గవర్నర్ సూచించారు.
మారుతున్న వాణిజ్యం, వ్యాపారం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సిలబస్లో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకోవాలని గవర్నర్ సూచించారు. హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ గా, అలాగే ఫార్మస్యూటికల్ హబ్గా ఎదుగుతున్నదని ఇదే కోవలో కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ రంగాలలో కూడా ఒక హబ్గా ఎదగాలని ఆకాంక్షించారు.
ప్రాక్టికల్ ఓరియంటెడ్, కేస్ స్టడీ పద్ధతులలో, ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించడం ద్వారా విద్యార్థులను కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ రంగాలలో భవిష్యత్తు లీడర్గా తీర్చిదిద్దాలని డాక్టర్ తమిళిసై పిలుపునిచ్చారు.
ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కేరళ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ హెచ్.వెంకటేశ్వర్లు, వెబినార్ కన్వీనర్ ఓయూ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ డి.చెన్నప్ప ప్రసంగించారు.
More Stories
దిశ ఎన్కౌంటర్ కేసులో హైకోర్టులో పోలీసులకు ఊరట
ఢిల్లీ పోలీసులను 4 వారల గడువు కోరిన రేవంత్ రెడ్డి
కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. ఒకే గూటి పక్షులు