కశ్మీరులో మరో డ్రోన్ ప్రత్యక్షం

జమ్మూకశ్మీరులోని పాకిస్థాన్ సరిహద్దుల్లో గురువారం రాత్రి మరో డ్రోన్ ప్రత్యక్షమైంది. జమ్మూకశ్మీరులోని సాంబా జిల్లా హీరానగర్ సెక్టారులో గురువారం రాత్రి 8.45 గంటలకు డ్రోన్‌ను స్థానిక ప్రజలు గుర్తించారు. డ్రోన్ లభ్యంపై స్థానికులు కేంద్ర భద్రతా బలగాలకు సమాచారం అందించడంతో వారు అప్రమత్తమయ్యారు. జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషను సమీపంలోనూ మరో డ్రోన్ కనిపించినట్లు జవాన్లు చెప్పారు. జమ్మూ వైమానిక 
 
కేంద్రం సమీపంలో వారం క్రితం డ్రోన్లు ప్రత్యక్షమైన నేపథ్యంలో జమ్మూ నగరంలో డ్రోన్ల విక్రయాలను నిషేధించారు. డ్రోన్లను వినియోగించరాదని ఆదేశాలు జారీ చేశారు. గత నెల 27వతేదీన జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషనుపై డ్రోన్ దాడి ఘటనలో ఇద్దరు ఎయిర్ ఫోర్స్ జవాన్లు గాయపడ్డారు. డ్రోన్ ద్వారా ఆర్డీఎక్స్, నైట్రేట్,ఐఈడీలను జార విడిచారని దర్యాప్తులో తేలింది. 
 
డ్రోన్లు వెలుగుచూడటంతో పాకిస్థాన్ సరిహద్దుల్లోని 3,500 కిలోమీటర్ల దూరంతోపాటు విమానాశ్రయాల వద్ద యాంటీ డ్రోన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. తాజాగా డ్రోన్లు కనిపించడంతో బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు.

ఇద్దరు ఉగ్రవాదుల హతం

కాగా, జమ్మూకశ్మీరులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటరులో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు.జమ్మూకశ్మీరులోని డన్మార్ అలందర్ కాలనీలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర కేంద్ర భద్రతా బలగాలు శుక్రవారం తెల్లవారుజామున గాలింపు ప్రారంభించాయి. 
 
గాలిస్తున్న జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని కశ్మీరు పోలీసు జోన్ ఐజీ చెప్పారు. ఉగ్రవాదుల కోసం అలందర్ కాలనీలో ఆర్మీ గాలింపు కొనసాగిస్తోంది. మరణించినవారిని లష్కరే తొయిబాకు చెందిన స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించామని చెప్పారు.