జాతీయ పండుగల జాబితాలో బోనాలను చేర్చేలా కృషి 

బోనాల పండుగను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తానని  కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వాటిని ప్రారంభించారు. 

దేశంలో ఎక్కడలేని విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వాహకులు బోనాల ఉత్సవాలు జరుపుతున్నారు. ఏడేళ్లుగా ఆలయకమిటీ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరుపుతోంది.

పంటలను రక్షించాలని, రోగాల నుంచి కాపాడాలని అమ్మవారిని కోరుతూ ఈ వేడుకలు జరుగుతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గతేడాది నుంచి కరోనా కారణంగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం లేకపోయిందని విచారం వ్యక్తం చేశారు. సాధారణ పరిస్థితుల్లో భారీ ఎత్తున మహిళలు, ప్రజలు పాల్గొంటారని గుర్తు చేశారు. 

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తరఫున కిషన్ రెడ్డి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభించాలని, కరోనాపై పోరులో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నానని ఆయన తెలిపారు.