భారత్‌లో యూఎస్‌ రాయబారిగా లాస్‌ ఏంజెల్స్‌ మేయర్‌

భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా లాస్ ఏంజెల్స్ మేయ‌ర్ ఎరిక్ గార్సెట్టి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయనను అధ్యక్షుడు జో బైడెన్‌ నామినేట్ చేశారు‌. అమెరికన్‌ సెనేట్ ధ్రువీకరిస్తే 50 ఏండ్ల గార్సెట్టి.. రాయబారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 
ట్రంప్ హయాంలో రాయబారిగా పనిచేసిన కెన్నత్‌ జస్టర్ స్థానంలో గార్సెట్టి నియమితులవుతారు. ఎరిక్‌.. 2013 నుంచి లాస్ ఏంజెల్స్ మేయర్‌గా, 12 ఏండ్లపాటు సిటీ కౌన్సిల్‌ సభ్యులుగా పనిచేశారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా బైడెన్‌ తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఎరిక్‌ను రాయబారిగా నామినేట్‌ చేశారని శ్వేతసౌథం తెలిపింది.
 
తన నామినేషన్‌పై ఎరిక్‌ గార్సెట్టి హర్షం వ్యక్తంచేశారు. భారత్‌లో అమెరికా రాయబారిగా నామినేట్‌ చేయడాన్ని గౌరవంగా భావిస్తానని చెప్పారు. అక్కడ విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాగా, బంగ్లాదేశ్‌ రాయబారిగా పీటర్‌ డీ హాస్‌, చిలీ రాయబారిగా మీహాన్‌, మొనాకో రాయబారిగా డినైస్‌ క్యాంప్‌బెల్‌ను అధ్యక్షుడు బైడెన్‌ నామినేట్‌ చేశారు.