పాత మం త్రుల నుండి పాఠాలు నేర్చుకోండి

నూతనంగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు పాత మం త్రుల వద్దకు వెళ్లి, వారి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  సూచించారు. కొత్త మంత్రులతో భేటీ నిర్వహిస్తూ ఉద్వాసన పలికినంతమాత్రాన పాత మంత్రులు అసమర్థులు కారని.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి కొత్త శక్తి కావాలని స్పష్టం చేశారు. 

కార్యాలయాలకు అందరూ ఉదయం 9.30గంటలకల్లా ఠంచనుగా రావాలనిపనిపైనే దృష్టిపెట్టాలని హితవు చెప్పారు. పనే ముఖ్యమని, మీడియా దృష్టిని ఆకర్షించాలనే విషవలయంలో పడవద్దని, అనవసర ప్రకటనలు చేయవద్దని మంత్రులకు సూచించారు. “,మీరు చేసే పనిని బట్టే మీకు ప్రచారం రావాలి” అని స్పష్టం చేశారు.

“క్రమశిక్షణతో కూడిన జీవనం గడుపుతున్న ప్రధాని తన అనుభవాల నుండి పారదర్శకతతో, ప్రజలకు అంకితమై పనిచేయాలని మాకు సూచించారని” ఈ సమావేశంలో పాల్గొన్న ఒక నూతన మంత్రి తెలిపారు. 

కాగా, కరోనా ముప్పు తొలగిపోలేదని ప్రధాని తెలిపారు. కరోనా నిబంధనలు పాటించకుండా ప్రజలు గుంపులుగా తిరుగుతుండడంపై ఆందోళన వెలిబుచ్చారు. వ్యాక్సినేషన్‌తో పాటు కరోనాపై పోరు  సాగుతోందని, ఈ సమయంలో చిన్న పొరపాటుకు  పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలు గుంపులుగా ఉన్న ఫొటోలు, వీడియోలను ఆయన ప్రస్తావించారు. చాలామంది మాస్క్‌ల్లేకుండా, భౌతిక దూరం పాటించకుండా కనిపిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని మంత్రులకు ప్రధాని ఉద్బోధించారు. 

కొత్త సవాళ్లను అధిగమించేలా విద్య
కాగా, మారుతున్న పరిస్థితుల్లో ఏర్పడే కొత్త సవాళ్లను అధిగమించేలా ఉన్నత, సాంకేతిక విద్యలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వచ్చే దశాబ్ద కాలంలో సాంకేతిక రంగంలో పరిశోధన, అభివృద్ధికే పెద్ద పీట వేయాలని పేర్కొన్నారు. అందుకే రానున్న పదేళ్ల కాలాన్ని ‘ఇండియాస్‌ టెకేడ్‌’ అని పిలుచుకోవచ్చునని మోదీ తెలిపారు. 
 
కేంద్ర ప్రభుత్వ నిధులతో పనిచేసే వందకుపైగా ఐఐటీల డైరెక్టర్లలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ మాట్లాడుతూ  విద్యారంగంలో పెట్టే ప్రతీ పైసా సామాజిక పెట్టుబడి అని, స్తోమత, సమానత్వం, నాణ్యత, అనుసంధానం అన్నవే ఉన్నత విద్యను ముందుకు నడిపిస్తాయని చెప్పారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రక్షణ, సైబర్‌ టెక్నాలజీ రంగాల్లో భవిష్యత్‌లో ఎదురయ్యే సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేలా దృష్టి సారించాలని ప్రధాని పిలుపునిచ్చారు.  కోవిడ్‌ విసిరిన సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ టెక్నాలజీ సంస్థలు చేసిన పరిశోధన, అభివృద్ధిని ప్రధాని కొనియాడారు. 

యువ టెక్కీలు అత్యంత వేగంగా సాంకేతికంగా పరిష్కార మార్గాలు సూచించడంతో ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. కృత్రిమ మేధ, స్మార్ట్‌ వేరబుల్స్, డిజిటల్‌ అసిస్టెంట్‌లు సామాన్య మానవుడికి చేరాలా ఉన్నత విద్యలో సాంకేతికను ప్రవేశపెట్టాలని సూచించారు. కృత్రిమ మేధతో కూడిన విద్యపైనే ప్రధానంగా దృష్టి సారించాలని కోరారు.