కేసీఆర్, జగన్ మధ్య రహస్య ఒప్పందం!

నీళ్లు, నిధులు, నియామకాలను జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్  తాకట్టు పెట్టారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ఆరోపించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య రహస్య ఒప్పందం ఉన్నదని స్పష్టం చేశారు. 2015లో జూన్ 18, 19 తేదీలలో మొదటిసారి జరిగిన సమావేశంలో నీటి పంపకాలపై తెలంగాణ సలహాదారు విద్యాసాగర్, హరీశ్ రావు అంగీకారం తెలిపిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

2016 సెప్టెంబర్ 21న జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారని గుర్తు చేశారు. 299  టిఎంసీల నీళ్లు తెలంగాణకు, 512 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు ఆనాడు కేటాయింపులు చేసుకున్న మాట వాస్తవం కాదా? అని సంజయ్ నిలదీశారు.  811 టీఎంసీలలో 575 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలని 12.5.2020న రజత్ కుమార్ లేఖ రాశారని చెప్పారు.

అప్పటి కౌన్సిల్ సమావేశంలో తెలంగాణకు అన్యాయం జరిగేలా మొదట ఒప్పుకుందే కేసీఆర్ అని సంజయ్ స్పష్టం చేశారు. రోజా ఇంటికి వెళ్ళినప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు. 203 జీవో మే5 న జారీ చేస్తే మొదట స్పందించింది బీజేపీయే అని సంజయ్ గుర్తు చేశారు. గతేడాది మే 11న దీనిపై కేంద్ర జలశక్తి మంత్రికి తాను లేఖ వ్రాయగా,  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలపై మే 12న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సీఎస్‌తో లేఖ రాయించారని వివరించారు.

తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర జలశక్తి కేఆర్ఎంబీని ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం ఆపేల చూడాలని కోరిందని చెబుతూ ఈ ఏడేళ్ల వ్యవధిలో ముఖ్యమంత్రి చేసిన కార్యక్రమాలపై షెడ్యూల్ విడుదల చేయగలారా? అని సవాల్ చేశారు.  మే నెల మొత్తం లేఖల ద్వారా హెచ్చరించినా,  ఆగస్టులో పనులు జరుగుతున్నాయని తెలిసినా సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తయ్యే సమయానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోలీసులు మోహరించేలా చేసి డ్రామాలు ఆడుతున్నారని సంజయ్ ధ్వజమెత్తారు. హుజురాబాద్ ఎన్నికలు ముగిసే వరకు ఈ డ్రామా నడుస్తుందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం జరిగే చోట అవసరమైతే రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకుంటారు. కొత్త డ్రామాలకు తెరలేపి.. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.