ఏపీలో 8మంది బంగ్లా దేశీయులు అరెస్ట్

బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడిన 8 మందిని రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌) సిబ్బంది శుక్రవారం  అదుపులోకి తీసుకున్నారు. వారెక్కడి నుంచి వచ్చారు? దేశంలోకి ఎలా ప్రవేశించారు? నకిలీ గుర్తింపుకార్డుల్ని ఎలా సంపాదించారనే అంశాలపై ప్రశ్నిస్తున్నారు.

వారు హావ్‌డా నుంచి రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. రాజమహేంద్రవరం, విజయవాడల్లో పట్టుకున్న రైల్వే పోలీసులు రాజమహేంద్రవరంలో రైల్వే పోలీసుల వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు. వారు దేశంలోకి ఎలా చొరబడ్డారు? నకిలీ గుర్తింపు కార్డులు ఎలా సంపాదించారు? అన్న అంశాలపై లోతుగా దర్యాప్తు చేపట్టారు.

భారత్‌లోకి చొరబడిన బంగ్లా దేశీయులు కోల్‌కతా చేరుకుని అక్కడ చెన్నై వెళ్లే రైలెక్కారు. వారు శ్రీకాకుళం జిల్లా పలాస వరకే రిజర్వేషన్ చేయించుకోగా, ఆ స్టేషన్ దాటిపోయినా రైలు దిగలేదు. దీనిపై తోటి ప్రయాణికులు ప్రశ్నించగా పలాస నుంచి చెన్నై వెళ్లడానికి రిజర్వేషన్‌ చేయించుకున్నామని, ఆ సీట్లు తమవని ఘర్షణకు దిగారు. 
 
దీంతో ప్రయాణికులు రైల్వే హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడంతో ఆర్‌పీఎఫ్‌ పోలీసులు విశాఖపట్నంలో రంగంలోకి దిగి వారిని ప్రశ్నించారు. వారు అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డారని నిర్ధారించుకుని రాజమహేంద్రవరంలో దించేశారు. ఆర్‌పీఎఫ్‌కు పట్టుబడ్డ నలుగురిలో కరీంఖాన్‌ ఉత్తరప్రదేశ్‌ వాసిని అంటూ నకిలీపత్రాలు సృష్టించుకున్నారు. వాటితోనే తనతో పాటు షేక్‌ సద్దాం, మహ్మద్‌ అలీ అమీన్‌, మహ్మద్‌ షకాయత్‌ హుస్సేన్‌లకూ రిజర్వేషన్‌ చేయించుకున్నారు. 
 
మరోవైపు హావ్‌డా- వాస్కోడిగామా రైలులోని ఎస్‌2 బోగీలోని 10 నుంచి 14 నంబర్లున్న బెర్తుల్లో అక్రమ చొరబాటుదారులైన కొందరు బంగ్లాదేశీయులు ప్రయాణిస్తున్నారంటూ కేంద్ర నిఘా విభాగం ఇచ్చిన సమాచారంతో ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది విజయవాడలో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్రంలో ఒకేరోజు 8 మంది బంగ్లాదేశీయులను ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం ఆధారంగా వారి వివరాల గురించి ఆంధ్రప్రదేశ్‌ కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ విభాగం ఆరా తీస్తోంది. వారు ఉపాధి కోసం వచ్చారా? లేక ఉగ్రవాద కార్యకలాపాల కోసం చొరబడ్డారా? అన్న కోణాల్లో ఆరా తీస్తున్నారు. 
 
ఇటీవల బిహార్‌లోని దర్బంగా రైల్వేస్టేషన్‌లో పేలుడుకు రసాయన పదార్థాల్ని రైల్లోనే తీసుకెళ్లినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలిన నేపథ్యంలో తాజా ఘటనపై నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ ఘటన ఆంధ్రా పోలీసులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.