మమతా బెనర్జీకి హైకోర్టు జరిమానా

నారదా కేసులో తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుల అరెస్టు సందర్భంగా మ‌మ‌తా బెన‌ర్జి వ్య‌వ‌హ‌రించిన తీరుపై క‌ల‌క‌త్తా హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. అయితే ఆ సంద‌ర్భంగా వ్యవహరించిన తీరుపై మ‌మ‌తాబెన‌ర్జి సమాధానం ఇచ్చేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఇచ్చిన సమయంలో అఫిడవిట్‌ దాఖలు చేయనుందుకుగానూ దీదీకి, బెంగాల్‌ ప్రభుత్వానికి రూ. 5వేల జరిమానా విధించింది.

నారదా కుంభకోణానికి సంబంధించి ఇద్దరు మంత్రులు సహా నలుగురు నాయకులను మే 17న సీబీఐ అరెస్టు చేసింది. వారి అరెస్టును నిరసిస్తూ మమతాబెనర్జీ సీబీఐ కార్యాలయంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మలయ్‌ ఘటక్‌ కేసు విచారణ జరుగుతున్న కోర్టు ప్రాంగణానికి వెళ్లారు. 

ఈ తీరుపై సీబీఐ అభ్యంతరం వ్య‌క్తంచేసింది. ఈ కేసును హైకోర్టే స్వీకరించాలంటూ దావా వేసింది. దాంతో హైకోర్టు కేసు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో నాయకుల అరెస్టు జరిగిన రోజు తాము వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి, న్యాయమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 9న హైకోర్టుకు సమాధాన అఫిడ‌విట్‌లు సమర్పించగా.. న్యాయస్థానం వాటిని తిరస్కరించింది.

కోర్టు చెప్పిన సమయం కాకుండా మీకు నచ్చినప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే స్వీకరించబోమని స్ప‌ష్టంచేసింది. దాంతో హైకోర్టు తీర్పుపై మమతాబెనర్జీ, న్యాయమంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్థనపై గతవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.

మమతా బెనర్జీ, తదితరులు ఇచ్చిన సమాధానాన్ని కలకత్తా హైకోర్టు స్వీకరించకపోవడం చట్టబద్ధం కాదని వ్యాఖ్యానించింది. వారి అఫిడవిట్లను రికార్డు చేయడంతోపాటు కేసును మళ్లీ మొదటి నుంచి విచారించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొత్తగా అఫిడ‌విట్‌లు దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలంటూ దీదీ గత సోమవారం హైకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును అంగీకరించిన న్యాయస్థానం.. సరైన సమయంలో అఫిడవిట్లు ఇవ్వనందుకుగానూ దీదీకి, బెంగాల్‌ ప్రభుత్వానికి రూ. 5 వేల జరిమానా విధించింది.