దర్భంగ రైల్వేస్టేషన్‌ పేలుడు మూలాలు హైదరాబాద్‌లో

దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా.. మూలాలు హైదరాబాద్‌లో ఉంటాయనే పేరున్నది.   తాజాగా బిహార్‌లోని దర్భంగ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న పేలుడు మూలాలు హైదరాబాద్‌లో బయటపడ్డాయి. ఈ నెల 17న దర్భంగ రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబరు ప్లాట్‌ఫాం వద్ద సికింద్రాబాద్‌ నుంచి వచ్చిన రైలులోంచి ఓ వస్త్రాల పార్శిల్‌ను దింపుతుండగా పేలుడు సంభవించింది. 

ఈ ఘటనలో ఎవరికీ గాయాలవ్వకున్నా,  ఆస్తి, ప్రాణనష్టం లేకున్నా, ఉగ్రవాద కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు ప్రారంభించింది. ఆ పార్శిల్‌ దర్భంగకు చెందిన మహమ్మద్‌ సూఫియాన్‌ అనే వ్యక్తికి చేరాల్సి ఉన్నట్లు గుర్తించింది.  

ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన తండ్రీకొడుకులు మహమ్మద్‌ సలీం ఖాసీం, మహమ్మద్‌ కఫీల్‌ను అరెస్టు చేసింది. వీరిద్దరికీ పాకిస్థాన్‌ నుంచి నిధులు బదిలీ అయినట్లు తేలింది.  పాకిస్థాన్‌కు చెందిన ఇక్బాల్‌ ఖానా అనే వ్యక్తి వీరికి డబ్బు పంపినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.

ఇక్బాల్‌ ద్వారా వీరిద్దరికీ హైదరాబాద్‌లో ఉంటున్న ఇమ్రాన్‌, నాసిర్‌ పరిచయమైనట్లు నిర్ధారించింది. అదే సమయంలో పేలుడుకు కారణమైన వస్త్రాల పార్శిల్‌ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి వచ్చినట్లు గుర్తించింది. దీంతో బిహార్‌ ఏటీఎస్‌ అధికారులు ఓ బృందాన్ని సికింద్రాబాద్‌ కు పంపారు.

వారు తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ అధికారులతో కలిసి పలు ఆధారాలను సేకరించారు. ఈ నెల 15న కారులో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చిన ఇద్దరు యువకులు వస్త్రాల పార్శిల్‌ను రైల్వే కౌంటర్‌ వద్ద అందజేసినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. వారిద్దరినీ సోమవారం అరెస్టు చేశారు.

వారిని ఇమ్రాన్‌, నాసిర్‌ అని, వారిద్దరూ అన్నదమ్ములని గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌లో.. బిహార్‌ ఏటీఎస్‌ నిర్బంధంలో ఉన్నారు. నేడో రేపో ఎన్‌ఐఏ బృందాలు వారిని అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఆసి్‌ఫనగర్‌లో ఉంటున్న ఇమ్రాన్‌, నాసిర్‌ స్వస్థలం యూపీలోని కురిసి అని తెలుస్తున్నది.

‘‘యూపీ నుంచి రెడీమేడ్‌ గార్మెంట్స్‌ వ్యాపా రం చేసేందుకు వారిద్దరూ హైదరాబాద్‌ ఆసి్‌ఫనగర్‌కు వచ్చారు. ఆర్డర్లపై పలు ప్రాంతాలకు గార్మెంట్స్‌ను తరలిస్తుంటారు. ఈ క్రమంలోనే యూపీకి పార్శిల్‌ పంపారు.  వస్త్రాల మధ్య ఉన్న ఓ సీసాలో ఉన్న ద్రవ పదార్థం కారణంగా పేలుడు సంభవించింది. యూపీలో అరెస్టయిన తండ్రీకొడుకులు కూడా వీరి పేర్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా ఈ ఘటన వెనక వీరి పాత్ర విస్పష్టమైం ది’’ అని అధికార వర్గాలు  పేర్కొన్నాయి.

అయితే ఈ నెట్‌వర్క్‌ వెనక నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉండి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ముంబై జైలులో ఉన్న ఐఎం ఆపరేటివ్‌ యాసీన్‌ భత్కల్‌ పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్రపన్నినట్లు నిఘావర్గాల హెచ్చరికలు ఉన్నాయి.