మాజీ ప్రధాని పీవీని అవమానించిన కాంగ్రెస్ 

రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో నిత్యం యాక్టివ్‌గానే ఉంటారని, కానీ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కనీసం నివాళులర్పిస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టలేదని కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి జి కిషన్ రెడ్డి  తీవ్రంగా మండిపడ్డారు. పీవీ శత జయంతి సందర్భంగా పీవీ లాంటి గొప్ప నేతకు నివాళులర్పించే తీరిక కూడా కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు. 

మాజీ ప్రధాని పీవీ జయంత్యుత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్‌లోని పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించారు. పీవీ అనేక పదవులను నిర్వహించి, సేవ చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వ్యవహార శైలిపై తీవ్రంగా మండిపడ్డారు. 

గాంధీ కుటుంబానికి పీవీ విధేయునిగానే ఉండేవారని, అయినా ఆయన్ను అనేక రకాలుగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేయడం తెలుగు వారిని అవమానించడమే అవుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఎంఐఎం నేత ఒవైసీ డైరెక్షన్‌లోనే కాంగ్రెస్ నడుస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. పీవీ పేరు తీస్తేనే ఒవైసీ ఒంటికాలుతో లేస్తారని, అందుకే రాహుల్ గాంధీ మాజీ ప్రధాని పీవీకి కనీసం నివాళులు కూడా  అర్పించలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.