సైనికులు, మాజీ సైనికుల పట్ల ప్రభుత్వానికి ఎంతో గౌరవం

The Union Minister for Defence, Shri Rajnath Singh interacting with the veterans, at Leh, Ladakh on June 27, 2021.

సైనికులు, మాజీ సైనికుల పట్ల తమ ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉన్నదని, అందుకే అధికారంలోకి రాగానే 30,40 ఏండ్లుగా కొనసాగుతున్న వన్ ర్యాంక్, వన్ పెన్షన్‌ను తీసుకొచ్చారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వారితో చెప్పారు. 
 
రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం ఉదయం కేంద్ర పాలిత ప్రాంతమైన లేహ్‌ చేరుకొని తన మూడు రోజుల పర్యటనను ప్రారంభించారు. లడఖ్‌లోని పలు చోట్ల నుంచి దళాలను ఉపసంహరించుకోవడంపై చైనాతో తదుపరి వివాదం మధ్య రక్షణ మంత్రి ఈ పర్యటన జరుపుతున్నారు. లేహ్‌ చేరుకున్న అనంతరం ఆయన మాజీ సైనికులతో సమావేశమయ్యారు.
 
మాజీ సైనికులకు పునరావాసం సమస్యలను కూడా పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నామని చెబుతూ ఎప్పటికప్పుడు ఉపాధి ఉత్సవాలను కూడా డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ పనులను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దేశ భద్రత పట్ల మీరంతా శ్రద్ధ వహించినట్లుగానే.. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత, లక్ష్యం మా ప్రభుత్వానిదని.. సమస్యల పరిష్కారం కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. 

మూడు రోజుల పర్యటన నిమిత్తం లేహ్‌ బయల్దేరడానికి ముందు ఇప్పుడే లడఖ్‌కు బయల్దేరుతున్నాను. అక్కడ సైనికులు, మాజీ సైనికులతో సంభాషిస్తాను. బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ నిర్మిస్తున్న అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ప్రారంభోత్సవంలో పాల్గొంటాను అని ట్విట్టర్‌ ద్వారా రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. 

రాజ్‌నాథ్ సింగ్ తన లడఖ్ పర్యటనలో సైనిక కార్యకలాపాల సన్నాహాలను తెలుసుకుంటారని సైనిక వర్గాలు తెలిపాయి. గత ఏడాది మే నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతను పరిష్కరించడానికి రెండు రోజుల క్రితం భారత-చైనా దౌత్యవేత్తల మధ్య సరికొత్త చర్చలు జరిగాయి.

తూర్పు లడఖ్‌లో అధిక ఎత్తులో ఉన్న సైనిక స్థావరాలు, నిర్మాణాలను సమీక్షిస్తారని, వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంట మోహరించిన సైనికుల మనోధైర్యాన్ని పెంచుతారని వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరిలో ఒప్పందం తర్వాత భారతదేశం-చైనా ప్యాంగాంగ్ సరస్సు సమీపంలో నుంచి దళాలు, ట్యాంకులు, ఇతర సామగ్రిని ఉపసంహరించుకున్న అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తూర్పు లడఖ్‌లో పర్యటిస్తున్నారు.