కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యక్తిగత అకౌంట్ను ట్విట్టర్ గంటసేపు శుక్రవారంనాడు నిలిపివేసింది. కాపీ రైట్స్ ఉల్లంఘన కింద ఆయన అకౌంట్ను బ్యాన్ చేసింది. ఆ తర్వాత దాదాపు ఒక గంట తరువాత అకౌంట్ను పునరుద్ధరించింది.
ఈ విషయాన్ని ఓ ట్వీట్లో రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ”యూఎస్ఏ డిజిటల్ మిలీనియం కాపీరైట్ (డీఎంసీఏ) చట్టం ఉల్లంఘన కింద నా అకౌంట్ను యాక్సిస్ కాకుండా ట్విట్టర్ చేసింది. ఆ తర్వాత గంట సేపటికి ట్విట్టర్ యాక్సిస్కు అనుమతించింది” అని రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు.
ఇది పూర్తిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు, 2021లోని రూల్ 4(8)ను పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొంటూ ట్విట్టర్ చర్యను మంత్రి ఖండించారు. వ్యక్తిగత అకౌంట్కు యాక్సిస్ నిరాకరించడానికి ముందు నోటీసు ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైందని ధ్వజమెత్తారు.
‘నేను పోస్ట్ చేసిన నా టీవీ ఇంటర్వ్యూ వీడియోలపై గత కొన్నేళ్లుగా ఏ టెలివిజన్ ఛానల్ గానీ కాపీరైట్ ఫిర్యాదులు చేయలేదు. కానీ, ఫిర్యాదులు వచ్చినందువల్లే ఖాతాను నిలిపివేసినట్లు ట్విటర్ చెబుతుంది. నిజానికి ట్విటర్ కు వ్యతిరేకంగా తాను మాట్లాడటంతోనే తన ఖాతాను బ్లాక్ చేసి ఉండవచ్చు’’ని ఇండియన్ ట్విటర్ కూ యాప్ లో కేంద్రమంత్రి పోస్ట్ చేశారు.
“నూతన ఐటీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించడానికి ట్విట్టర్ ఎందుకు నిరాకరిస్తో౦దో ఇప్పుడు స్పష్టమవుతో౦ది. ఎ౦దుక౦టే ట్విటర్ అనుసరిస్తే, తమ ఎజెండాకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తుల ఖాతాలను ఏకపక్షంగా నిలిపివేయడం ఉండదు కదా..” అని భారతీయ సోషల్ మీడియా వేదిక ‘కూ’లో ట్విటర్ పై వరుస వ్యాఖ్యలతో మంత్రి విరుచుకుపడ్డారు.
ఇప్పటికి నూతన ఐటీ నిబంధనలపై తాము రాజీపడే ప్రసక్తే లేదని, ఏ సామాజిక మాధ్యమ వేదికైనా భారతీయ చట్టాలను, నిబందనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని రవిశంకర్ ప్రసాద్ మరోసారి స్పష్టం చేశారు. కాగా, డీఎంసీఏ కింద ఏయే పోస్టులను ట్విట్టర్ తొలగించిందని వెంటనే తెలియరాలేదు.
More Stories
‘టైమ్ 100’ జాబితాలో అజయ్ బంగా, ఆలియాభట్, సత్య నాదెళ్ల
అతి త్వరలో మావోయిస్టుల అంతం
బాలరాముడికి సూర్యతిలకం