సూరత్ కోర్ట్ లో మాట మార్చిన రాహుల్ గాంధీ

గుజరాత్‌లోని సూరత్‌ కోర్టుకు గురువారం హాజరైన కాంగ్రెస్ నేత మాట మార్చారు. . ఆయనపై 2019లో పరువు నష్టం కేసు దాఖలైంది. బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ దాఖలు చేసిన కేసులో తుది వాంగ్మూలం ఇచ్చేందుకు రాహుల్‌ గాంధీ కోర్టుకు హాజరయ్యారు.
‘‘ఈ దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అయిందబ్బా’’ అని తాను చేసిన వ్యాఖ్యలపై  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెనుకకు తగ్గారు. తన వ్యాఖ్యలు కేవలం వ్యంగ్యంతో కూడినవని సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేశారు. 2019 ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ కుంభకోణాలకు పాల్పడి విదేశాలకు పారిపోయినవారిని ప్రస్తావించారు.

 ‘‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ… వీళ్ళందరి ఇంటి పేర్లలో ‘మోదీ’ ఎలా ఉందబ్బా? ఈ దొంగలందరి ఇంటి పేరు ఒకే విధంగా ‘మోదీ’ ఎలా అయిందబ్బా?’’ అని అన్నారని బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ ఆరోపించారు. 

2019 ఏప్రిల్‌లో పూర్ణేష్ మోదీ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. మోదీ అనే ఇంటి పేరు ఉన్నవారినందరినీ రాహుల్ గాంధీ అవమానించారని ఆరోపించారు. ఈ కేసులో 2019 అక్టోబరులో రాహుల్ గాంధీ సూరత్ కోర్టులో హాజరయ్యారు. తాను తప్పు చేయలేదని కోర్టుకు తెలిపారు. 

తదుపరి విచారణ జూన్ 24న జరుగుతుందని కోర్టు ప్రకటించింది. దీంతో రాహుల్ గాంధీ గురువారం కోర్టుకు హాజరయ్యారు. తాను ఏ వర్గాన్నీ లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కేవలం వ్యంగ్యంగా మాట్లాడానని పేర్కొన్నారు.  దీని గురించి తనకు ఇంత కన్నా ఎక్కువగా జ్ఞాపకం లేదని చెప్పారు.

కాగా,  కోర్ట్ కు హాజరు కావడానికి  ముందు చేసిన ఓ ట్వీట్‌ లో అస్తిత్వ రహస్యం పట్ల భయపడేది లేదంటూ రాహుల్ స్పష్టం చేశారు. ఈ కేసులో 2019 అక్టోబర్‌లో  రాహుల్‌ ఇంతకు ముందు హాజరై.. ఆరోపణల్ని నమోదు చేయొద్దని, తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని కోర్టును అభ్యర్థించారు కూడా.