పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలకు భారత దేశ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చర్యల ప్రణాళికను ప్రతిపాదించారు. షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) నిబంధనావళిలో భాగంగా పాక్ గడ్డపైనున్న లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నిశితంగా గమనించవలసిన అవసరం ఉందని చెప్పారు. ఆయుధాల అక్రమ రవాణాకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారని, డార్క్ వెబ్, కృత్రిమ మేధాశక్తి, సామాజిక మాధ్యమాలను దుర్వినియోగపరుస్తున్నారని పేర్కొన్నారు.
తజకిస్థాన్ రాజధాని దుషాంబేలో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాల్లో బుధవారం అజిత్ దోవల్ మాట్లాడుతూ, ఉగ్రవాద నిరోధానికి ఐక్య రాజ్య సమితి చేసిన అన్ని తీర్మానాలను సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు. ఐక్య రాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.
సీమాంతర ఉగ్రవాద దాడులు, ఉగ్రవాదులపై కేసుల విచారణను వేగవంతం చేయాలని పిలుపిచ్చారు. ఆఫ్ఘనిస్థాన్లో గత రెండు దశాబ్దాల్లో సాధించిన విజయాలను కాపాడుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేయాలని కోరారు.
ఆఫ్ఘనిస్థాన్పై ఎస్సీఓ కాంటాక్ట్ గ్రూపును భారత్ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ‘‘భారత దేశం ఎస్సీఓ సభ్య దేశంగా 2017లో చేరినప్పటికీ, ఈ సంఘంలోని దేశాలతో భారత దేశానికి అనేక శతాబ్దాల నుంచి భౌతిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, తాత్విక అనుబంధం ఉంది’’ అని దోవల్ చెప్పారు.
ఈ సమావేశాల్లో ఎస్సీఓ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)లు పాల్గొన్నారు. రష్యా ఎన్ఎస్ఏ నికొలాయ్ పట్రుషెవ్తో అజిత్ దోవల్ చాలాసేపు చర్చలు జరిపారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యంగల సమకాలీన పరిణామాలపై చర్చించారు.
More Stories
వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు
సియాచిన్ గ్లేసియర్ వద్ద చైనా సరికొత్త రాదారి
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్