ఇద్దరు ఐఎఎస్‌లకు వారం రోజుల జైలు… అంతలోనే రీకాల్ 

కోర్టు ధిక్కరణ అంశంలో ఇద్దరు ఐఎఎస్‌లకు జైలు శిక్ష విధిస్తూ ఎపి హైకోర్టు తీర్పునిచ్చింది. చిరంజీవి, గిరిజా శంకర్‌కు వారం రోజులపాటు జైలుశిక్ష విధించింది. అయితే ఐఏఎస్ లకు వేసిన జైలు శిక్షను కాసేపటికే హైకోర్టు రీకాల్ చేసింది. జైలు శిక్ష తీర్పును హెచ్చరికగా పరిగణించాలని ధర్మాసనం పేర్కొంది.
 
36 మంది ఉద్యోగులను క్రమబద్దీకరించాలని గత ఏప్రిల్ లో హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును అధికారులు అమలు చేయలేదు. చేస్తామని చెప్పి కాలయాపన చేస్తుండడంపై హైకోర్టు స్పందించి మళ్లీ గుర్తు చేసింది. అయినా తీర్పు అమలు కానందుకు బాధితులు మరోసారి కోర్టు తలుపు తట్టారు. 
 
పిటిషన్ పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టగా కోర్టు హెచ్చరికల నేపధ్యంలో ఐఏఎస్ అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్ కూడా వ్యక్తిగతంగా హాజరయ్యారు. తీర్పులను ఆషామాషీగా తీసుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరికి వారం రోజుల జైలు శిక్ష విధిస్తున్నట్ల తీర్పు చెప్పింది.
విచారణ సందర్భంగా అధికారుల తీరును  క్రమ శిక్షణా రాహిత్యంగా కోర్ట్ పరిగణించింది. కోర్టు తీర్పు పై ఐఏఎస్ అధికారుల్లో కలకలం రేపింది. ఉన్నతాధికారులు వెంటనే ప్రత్యేక న్యాయవాది ద్వారా తీర్పును గురువారం లోగా అమలు చేస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. 
దీంతో హైకోర్టు శాంతించి.. జైలు శిక్షను రద్దు చేసింది. అయితే ప్రభుత్వ చర్యతో శాంతించినట్లు కాదని.. తమ తీర్పును హెచ్చరికగా భావించాలని హైకోర్టు స్పష్టం చేసింది.