స్విస్ బ్యాంకుల్లో భార‌తీయుల నల్లధనం అబద్దం

స్విస్ బ్యాంకుల్లో భార‌తీయులు దాచిన న‌ల్ల‌ధ‌నం గ‌త ఏడాది సుమారు రూ 20 వేల కోట్లకు పెరిగిన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ ఖండించింది. భార‌తీయులు స్విస్ బ్యాంకుల్లో గ‌త 13 ఏళ్ల‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో డిపాజిట్లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ ఆరోప‌ణ‌ల‌ను కూడా కేంద్రం ఖండించింది. 

2019లో రూ 6625 కోట్లుగా ఉన్న భార‌తీయుల నిధులు.. గ‌త ఏడాది అమాంతంగా రూ 20 వేల కోట్లకు చేరిన‌ట్లు ఓ మీడియా క‌థ‌నం పేర్కొన్న‌ది. ఆ వార్త‌ను కేంద్ర ఆర్థిక మంత్రి కార్యాల‌యం ఖండించింది. స్విస్ నేష‌న‌ల్ బ్యాంక్‌కు వివిధ స్విస్ బ్యాంకులు స‌మ‌ర్పించిన మొత్తం ఫిగ‌ర్‌ను త‌ప్పుగా చిత్రీక‌రించిన‌ట్లు ఆర్థిక శాఖ వెల్ల‌డించింది. 

స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎన్ఎన్‌బీ)కి బ్యాంకులు నివేదించిన అధికారిక గణాంకాల ప్రకారం.. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం డిపాజిట్ అయిందనేది నిజం కాదని, ఇంకా చెప్పాలంటే డిపాజిట్ అయిన మొత్తం భారతీయులది, ఎన్నారైలది కాదని, ఆ సొమ్ము ఇతర దేశాలకు చెందిన వారిదని కేంద్రం వివరించింది.

నిజానికి 2019 చివరి నుంచి ఖాతాదారుల డిపాజిట్లు క్షీణిస్తూ వచ్చాయని తెలిపింది. వారంతా బాండ్లు, సెక్యూరిటీల రూపంలోను, ఇతర ఆర్థిక విధానాల్లో జమ చేస్తూ వస్తున్నారని వివరించింది.ఫైనాన్షియల్ అకౌంట్స్ సమాచారం ప్రకారం.. స్విస్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్ మొత్తం పెరిగినట్టు సమాచారం లేదని, పెరిగిన మొత్తం కూడా భారతీయులదేనని కచ్చితమైన సమాచారం లేదని పేర్కొంది. 

ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను స్విస్ అధికారుల నుంచి భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ మరిన్ని వివ‌రాల‌ను సేక‌రిస్తున్న‌ట్లు ఆర్థిక మంత్రిత్వ‌శాఖ కార్యాల‌యం పేర్కొన్న‌ది. డిపాజిట్లు స‌గం త‌గ్గిన‌ట్లు చెప్పిన ప్ర‌భుత్వం.. ఎంత అమౌంట్ అన్న విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌లేదు.