పాత ధరలకే రైతులకు డిఎపి ఎరువులు 

డిఎపి ఎరువుల ధరలలో సబ్సిడీని బస్తాకు రూ 700 వరకూ పెంచారు. ఈ మేరకు సబ్సిడీ పెంపుదలతో ప్రభుత్వ ఖజానాకు రూ 14,475 కోట్ల అదనపు భారం పడుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ  అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి మండలి సమావేశంలో అందుకు ఆమోదం తెలిపారు. ఇప్పుడు వర్షాకాలం ఆరంభం అయింది. రైతులు దుక్కులు దున్నే దశలో వారికి భూసారపు ఎరువులు సరైన అందే దిశలో చర్యలు తీసుకోవాలని కేంద్రం సంకల్పించింది.
 
అంతర్జాతీయ స్థాయిలో ఎరువులు సంబంధిత ధరలు పెరుగుతూ ఉన్నా, దేశంలో వీటిని పాత రేట్లకు విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశంలో డై అమ్మోనియం ఫాస్పేట్ (డిఎపి) ఎరువులను రైతులు విస్తారంగా వాడుతారు. డిఎపి ఎరువులకు సిబ్సిడీని 140 శాతం పెంచాలని గత నెలలోనే కేంద్రం నిర్ణయించింది. 
 
ఇప్పుడు దీనికి బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించిందని ఆ తరువాత కేంద్ర ఎరువులు, రసాయనాల సహాయ మంత్రి మన్‌సుఖ్ మాండవియా విలేకరులకు తెలిపారు. డిఎపిపై రైతులకు ఇచ్చే సబ్సిడీ పెంపుదల నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. 
ఒక బస్తాలో 50 కిలోల ఎరువు ఉంటుంది. ఇంతకు ముందు సబ్సిడీ రూ 500 వరకూ ఉండేది. ఇప్పు డు సబ్సిడీని రూ 700 పెంచారని, దీనితో బస్తాపై సబ్సిడీ రూ 1200 అయిందని, సబ్సిడీ పెంపుదలతో ప్రభుత్వంపై పడే భారం దాదాపు రూ 15వేల కోట్ల వరకూ ఉంటుందని మంత్రి చెప్పారు.
 
త ఏడాది డిఎపి ఎరువు బస్తా నికర ధర రూ 1700గా ఉండేది. ఇందులో ప్రభుత్వం నుంచి రూ 500 రాయితీ దక్కేది. దీనితో ఈ ఎరువును కంపెనీలు రైతులకు రూ 1200గా విక్రయించారు. అయితే పలు కారణాలతో ప్రపంచవ్యాప్తంగా డిఎపి వాస్తవిక ధర రెండింతలు అయి బస్తాకు రూ 2400 అయింది.
 
రైతులకు పాత ధరలకే బస్తా డిఎపి దొరికేందుకు వీలుగా బస్తాకు రూ 1200 (ఇంతకు ముందటి రూ 500, ఇప్పటి రూ 700) ఖరారు చేశారు. దీనితో రైతులు బస్తా ఎరువును రూ 1200కు పొందేందుకు వీలుంటుంది. అయితే యూరియాకు సంబంధించి గరిష్ట టోకు ధరను ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. కానీ సబ్సిడీ రేట్లు మారుతూ ఉంటాయి.
సగటున యూరియాపై బస్తాకు కేంద్రం రూ 900 వరకూ సబ్సిడీని అందిస్తోంది. అయితే యూరియాయేతర ఎరువులకు సంబంధించి సబ్సిడీని ప్రభుత్వం నిర్థిష్టంగా ఖరారు చేసిందని మంత్రి వివరించారు.