ట్విట్టర్‌కు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమన్లు

ట్విట్టర్‌కు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ప్యానెల్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.  ఈ సందర్భంగా కమిటీ డిజిటల్‌ వేదికలపై పౌరుల హక్కుల పరిరక్షణ, మహిళల భద్రత, ఆన్‌లైన్‌ వార్తలు దుర్వినియోగం కాకుండా తీసుకునే చర్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్త ఐటీ నిబంధనలను తీసుకొచ్చింది.

ఈ విషయమై కేంద్రం ఇటీవల ట్విట్టర్‌కు చివరి నోటీసు ఇచ్చింది. కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ నుంచి పదే పదే లేఖలు రాసినా.. ట్విట్టర్ నుంచి సరైన స్పందన రాలేదు. అయితే కొత్త ఐటీ రూల్స్ ను తాము పాటిస్తామని గత వారంలో ట్విట్టర్ హామీ ఇచ్చింది. భారత్‌తో తాము నిర్మాణాత్మక సంభాషణను కొనసాగిస్తామని ట్విట్టర్ ప్రతినిధి పేర్కొన్నారు. 

కొత్త మార్గదర్శకాలను పాటించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, అయితే కొవిడ్‌ మహమ్మారి కారణంగా చేయలేకపోయామని పేర్కొన్నారు. చీఫ్‌ కంప్లైయెన్స్‌ ఆఫీసర్‌ను నియామకాన్ని పూర్తి చేసే దశలో ఉన్నామని, రాబోయే రోజుల్లో అదనపు వివరాలు అందించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు ఈ నెల 7న ఐటీ మంత్రిత్వశాఖకు రాసిన లేఖలో ట్విట్టర్‌ పేర్కొంది.

ఈ క్రమంలో కొత్త ఐటీ నిబంధనలను పాటించడానికి ట్విట్టర్‌కు ఉన్న ఇబ్బందులు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామని పార్లమెంటరీ కమిటీ ప్రకటించింది. దేశం రూపొందించిన నిబంధనలను అనుసరించడానికి ట్విట్టర్‌కు ఏ పరిమితులు అడ్డంకిగా ఉన్నాయో తాము తెలుసుకోవాలనుకొంటున్నామని పార్లమెంటరీ కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు.