దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా

దేశంలో మరో స్వదేశీ వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. గుజరాత్‌‌‌కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. 

అత్యవసర వినియోగానికి అనుమతి లభిస్తే చిన్నారులకు సైతం ఇవ్వగలిగే తొలి వ్యాక్సిన్‌గానూ నిలువనుంది. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో రెండు విదేశీ వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతుండగా.. మరొకటి స్వదేశీ టీకా. కరోనాకు వ్యతిరేకంగా జైడస్‌ క్యాడిలా మరో స్వదేశీ టీకాపై పని చేస్తోంది.

డీసీజీఐ అనుమతి ఇస్తే అందుబాటులోకి రానున్న నాలుగో టీకాగా నిలువనుంది. వ్యాక్సిన్‌ 12 ఏళ్లు దాటినవారిపై కూడా ట్రయల్స్ నిర్వహించడం, సత్ఫలితాలనివ్వడంతో చిన్నారులకు సైతం ఇవ్వగలిగే తొలి వ్యాక్సిన్ ఇదే అవుతుంది. 

కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుట్నిక్ వీ టీకాలు రెండు డోసులు కాగా.. జైకోవ్‌ డీ వ్యాక్సిన్‌ మూడు డోసులు. మొదటి డోసు వేసుకున్న 28 రోజులకు రెండో మోతాదు, మూడో మోతాదు 56 రోజుల తర్వాత వేయనున్నారు. జైకోవ్‌-డీ డీఎన్‌ఏ ప్లాస్మిడ్‌ వ్యాక్సిన్‌ కాగా.. 2 నుంచి 8 డిగ్రీల వద్ద నిల్వ చేయవచ్చు.

కంపెనీ 200 మిలియన్‌ మోతాదులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు భాగస్వాములతో కలిసి పని చేస్తున్నది. ఆగస్ట్ – డిసెంబర్‌ మధ్య 50 మిలియన్ల జైకోవ్‌-డీ టీకాల లభ్యత ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.