గవర్నర్ కొత్త క్రింద రాష్ట్ర శాసన మండలికి నలుగురు సభ్యులను నామినేట్ చేయడానికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించిన నాలుగు పేర్ల విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ ఫైల్ ను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంతకం పెట్టకుండా పెండింగ్ లో పెట్టిన్నట్లు తెలుస్తున్నది.
దానితో ఇరకారంలో పడిన ముఖ్యమంత్రి ఈ సాయంత్రం 5 గంటలకు స్వయంగా గవర్నర్ ను కలసి ఆయా పేర్లగురించి వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఆ నలుగురి పేర్లలో ఇద్దరిపై కొన్ని క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉండడంతో, వారిని నామినేట్ చేయడానికి గవర్నర్ విముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం 4పేర్లు.. లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు జిల్లా), తోట త్రిమూర్తులు (తూర్పుగోదావరి), మోషేన్ రాజు (పశ్చిమగోదావరి), రమేశ్ యాదవ్ (అనంతపురం జిల్లా)తో కూడిన జాబితాను గవర్నర్కు పంపింది. సాధారణంగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఫైళ్లను ఆయన అదేరోజు ఆమోదించి పంపిస్తారు. చాలా ఫైళ్లు గంటల వ్యవధిలోనే ఆమోదంతో ప్రభుత్వానికి తిరిగి వెళ్లిపోతాయి.
కానీ ఎమ్మెల్సీల నియామకం ఫైలు వెళ్లి 4రోజులైనా ఇంతవరకూ ఆమోదం పొందలేదు. ఇందులో లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులుపై క్రిమినల్ కేసులు న్నట్లు గవర్నర్కు ఫిర్యాదులు అందాయి. గవర్నర్ కార్యాలయం తెప్పించుకున్న సమాచారం కూడా దీనిని ధ్రువీకరించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
త్రిమూర్తులుపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదై ఉంది. అప్పిరెడ్డిపై పలు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని అంటున్నారు. తన కోటా కింద జరుగుతున్న నియామకాలు కావడంతో గవర్నర్ వీరి పేర్లను క్షుణ్ణంగా పరిశీలించారని, నామినేటెడ్ కోటాలో నియమితమయ్యేవారు వివాదరహితులై ఉండాలని, నేర చరితులై ఉండకూడదని ఆయన ఆశిస్తున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో తన ద్వారా జరిగే నియామకాల్లో గవర్నర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి ఆ మధ్య రాష్ట్రప్రభుత్వం ముగ్గురి పేర్లతో జాబితా పంపింది. అందులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్పై సర్కారు మొగ్గు చూపిందని ప్రచారం జరిగింది.
కానీ గవర్నర్ ఆ ముగ్గురి సర్వీసుకు సంబంధించిన వార్షిక కాన్ఫిడెన్షియల్ రికార్డులు తెప్పించుకుని పరిశీలించారు. శామ్యూల్తో పాటు మరొకరి విషయంలో కొన్ని వివాదాలు ఉన్నట్లు గుర్తించి, చివరకు మాజీ సీఎస్ నీలం సాహ్ని పేరును ఓకే చేశారు. ఇప్పుడు నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలోనూ తన అభ్యంతరాలను తెరపైకితెచ్చారు. ఆయన మనోగతం తెలియడంతో ముఖ్యమంత్రి గవర్నర్ను కలవాలని నిర్ణయించారు.
ఆయన గవర్నర్కు నచ్చజెప్పి ఆమోదం పొందగలుగుతారా లేక ఆ రెండుపేర్లు తప్పించి వేరే పేర్లు ఇస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. కాగా, ఎమ్మెల్సీల జాబితాకు గవర్నర్ శని/ఆదివారాల్లో ఆమోదం తెలుపుతూ ఆదేశాలు ఇవ్వబోతున్నారని మీడియాకు సమాచారం లీక్ చేయడం విశేషం. ఇదే విషయం ప్రసార సాధనాల్లో ప్రముఖంగా వచ్చింది.
గవర్నర్ సంతకం పెడితే సోమవారం ఈ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం పెట్టుకోవాలని కూడా వైసీపీ వర్గాలు సన్నాహాలు చేశాయి. అయితే, ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటన వివరాలు తెలపడం కోసం కేవలం మర్యాదపూర్వకంగా గవర్నర్క తో భేటీ అవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
More Stories
ఏపీలో హింసాత్మక ఘటనలపై సీఎస్, డీజీపీలకు సమన్లు
దేశంలోనే అత్యధికంగా ఏపీలో 82 శాతం పోలింగ్
వడ్డీ రేట్లను భారీగా పెంచిన స్టేట్ బ్యాంకు