కుల్‌భూషణ్‌ `అప్పీలు’కు పాక్ పార్లమెంట్ ఆమోదం 

గూఢచర్యం, తీవ్రవాద ఆరోపణలతో పాకిస్తాన్‌ ఉరిశిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు ఊరట లభించింది. ఉరిశిక్షపై జాదవ్‌ అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు పాకిస్తాన్‌ పార్లమెంటు ఆమోదం తెలిపింది.
 
2017 ఏప్రిల్‌లో కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాకిస్తాన్‌ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించింది. దీనిపై భారత ప్రభుత్వం అప్పీలు చేయడంతో విచారణ జరిపిన అంతర్జాతీయ న్యాయస్థానం అప్పీలుకు అనుమతించాలని 2019, జులైలో పాకిస్తాన్‌కు ఆదేశాలు ఇచ్చింది. భారత దౌత్యవేత్తల్ని కలిసేందుకు కూడా అనుమతించాలని ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో ఐసిజె (రివ్యూ అండ్‌ రీకన్సిడరేషన్‌) బిల్లు 2020పై చర్చించిన పాక్‌ జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం అనంతరం ఆ దేశ న్యాయశాఖ మంత్రి నసీం మాట్లాడుతూ, బిల్లు ఆమోదం ద్వారా పాకిస్తాన్‌ను బాధ్యతాయుత దేశంగా ప్రపంచానికి మరోసారి నిరూపించామని చెప్పారు. 
 
ఒక‌వేళ ఈ బిల్లును పాస్ చేయ‌కుంటే, భారత్ మ‌ళ్లీ యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లిని ఆశ్ర‌యించేద‌ని, కోర్టు ధిక్క‌ర‌ణ కింద పాక్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసేద‌ని పేర్కొన్నారు.