కరోనా మందులు, పరికరాలపై జీఎస్టీ తగ్గింపు 

కొవిడ్‌ అత్యవసర వస్తువులు, బ్లాక్‌ ఫంగస్‌ మందులపై పన్ను రేట్ల తగ్గింపు, ఆక్సిజన్‌, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లతో సహా పలు ఇతర వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తూ శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో జరిగిన 44వ జీఎస్టీ మండలి సమావేశం నిర్ణయించింది.
 
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జ‌రిగిన ఈ సమావేశంలో  బ్లాక్ ఫంగ‌స్ చికిత్స‌లో వాడే రెండు ఔష‌ధాలు ఆంఫోటెరిసిన్ బీ, టోసిలిజుమాబ్‌కు జీఎస్టీ మిన‌హాయింపు ఇచ్చారు. రెమ్‌డెసివిర్‌పై ప‌న్ను 12 నుంచి 5 శాతానికి త‌గ్గించారు.
 
అంబులెన్స్ సేవ‌ల‌పై జీఎస్టీ 28 శాతం నుంచి 12 శాతానికి త‌గ్గించారు. వ్యాక్సినేష‌న్‌పై జీఎస్టీ 5 శాతం య‌థాత‌థంగా ఉంచారు. ఆక్సిజ‌న్ యూనిట్లు, ఉత్ప‌త్తి యంత్రాల‌పై జీఎస్టీ త‌గ్గించారు. కొవిడ్ మెడిసిన్స్, టెస్టింగ్ కిట్లు, ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ల‌పై జీఎస్టీ త‌గ్గించారు. ఆక్సిజ‌న్, మాస్కు, కొవిడ్ టెస్టు కిట్లు, ప‌ల్స్ ఆక్సిమీట‌ర్లు, వెంటిలేట‌ర్ల‌పై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి త‌గ్గించారు. కొత్త ధ‌ర‌లు సెప్టెంబ‌ర్ నెల‌ఖారు వ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయని నిర్మ‌లా సీతారామ‌న్ స్ప‌ష్టం చేశారు.
 
కేంద్ర ఆర్ధిక సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్ధిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏర్పాటు చేసిన మంత్రివర్గ  ఉపసంఘం చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.