కొత్త పోర్టల్‌ను ప్రారంభించిన ఆదాయం పన్ను  శాఖ

ఆదాయం పన్ను (ఐటీ) శాఖ ‘ఈ-ఫైలింగ్‌ 2.0’ను www. incometax.gov.in ప్రారంభించింది. ఈ కొత్త పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఐటీ రిటర్నులు, పన్ను చెల్లింపులు మరింత సులభం కానున్నాయి. ఒక్కసారి నమోదిత యూజర్‌ పోర్టల్‌లోకి లాగిన్‌ అయితే డ్యాష్‌బోర్డులో వివరాలన్నీ కనిపించేస్తాయి. 

‘మై ప్రొఫైల్‌’ మెనూ కింద వ్యక్తిగత వివరాలనూ మార్చుకోవచ్చు. అయితే డీఎస్‌సీను ట్యాక్స్‌పేయర్లు మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఐటీ శాఖ స్పష్టం చేసింది. అంతేగాక ‘ప్రైమరీ కాంటాక్ట్‌’ కింద వ్యక్తిగత మొబైల్‌ నెంబర్‌ను, ఈమెయిల్‌ ఐడీలను కూడా అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

కొత్త పోర్టల్‌ ప్రత్యేకతలు

  • వివిధ ప్రాంతీయ భాషల్లో పన్ను చెల్లింపుదారులకు సేవలు
  • వ్యక్తిగత, సంస్థాగత, సంస్థాగతేతర, పన్ను నిపుణులు తదితర ట్యాక్స్‌పేయర్ల కోసం ప్రత్యేకంగా ట్యాబ్‌లు
  • ఐటీఆర్‌ ఫైలింగ్‌, రిఫండ్‌ స్టేటస్‌, ట్యాక్స్‌ శ్లాబులపై చెకింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ కోసం ఓ డ్రాప్‌-డౌన్‌ మెను
  • అందుబాటులో ఉన్న సేవలను అర్థం చేసుకోవడానికి వీడియోలు, ఎఫ్‌ఏక్యూలు, యూజర్‌ మాన్యువల్స్‌
  • గైడెన్స్‌ కోసం చాట్‌బోట్‌, హెల్ప్‌లైన్ల సౌకర్యాలు